రాహుల్ గాంధీ చెప్పులు మోసిన మాజీ కేంద్రమంత్రి!
న్యూఢిల్లీ: రాజకీయ నేతలు తమ అనుచరులు, సెక్యూరిటీ సిబ్బందితో చెప్పులు, బూట్లు మోయించి విమర్శలు పాలైన ఘటనలు గతంలో చాలానే చాశాం. తాజాగా ఈ జాబితాలోకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరారు. రాహుల్ గాంధీ చెప్పులు మోసింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
రాహుల్ గాంధీ మంగళవారం పుదుచ్చేరిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చెప్పులను మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వీ నారాయణస్వామి మోస్తూ కనిపించారు. యూపీఏ హయాంలో నారాయణ స్వామి ప్రధానమంత్రి కార్యాలయ మంత్రిగా ఉన్నారు.
ఈ వీడియో దృశ్యాలు వెలుగులోకి రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వీడియోలో నారాయణ స్వామి చెప్పులు పట్టుకుని వాటిని రాహుల్ కాళ్ల ముందు పెట్టగా, ఆయన వాటిని వేసుకుని నడుస్తూ వెళ్లినట్టు కనిపిస్తోంది. అయితే, తాను రాహుల్ గాంధీ చెప్పులను మోసినట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు.
ఈ ఘటనపై స్పందించిన నారాయణ స్వామి ఆయన బూట్లు వేసుకొచ్చారని, వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకున్న తర్వాత వాటిని తొలగించి నీటిలో నడవడానికి ఇబ్బంది పడుతుంటే, తన చెప్పులు ఇచ్చానని ఆయనపై గౌరవంతోనే అలా చేశానని తెలిపారు. ఆ చెప్పులను ఆయన మోహమాట పడకుండా వేసుకుని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చెప్పులు మోసే సంస్కృతి లేదని నారాయణస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన షూస్ను ఆయనే పట్టుకు నడిచారని, కనీసం సెక్యూరిటీ గార్డులకు కూడా ఇవ్వలేదని ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఘటనపై సోషల్ మీడియాలో రాహుల్ గాంధీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.