‘నా శీలం దోచేసింది.. రేప్ కేసు పెట్టండి’
బెంగళూరు: తనకు ఇష్టం లేకపోయినప్పటికీ తనతో సహజీవనం చేసి గర్భవతి అయిన తర్వాత తనను వదిలేస్తానంటోందని ఓ యువతిపై ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. తన శీలాన్ని దోచేసి, ఇప్పుడు తనను వదిలేసిందని ఆరోపించాడు. శీలం కోల్పోయిన తాను ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలని వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తుమకూరు జిల్లా బెళ్లావి తాలూకాకు చెందిన శివకుమార్ అనే యువకుడు రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. రెండు నెలలుగా సదరు యువతి అతడికి దూరంగా ఉంటోంది. దీంతో రెండు రోజుల ముందు శివకుమార్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు.
మొదట్లో వద్దంటున్నా యువతి తనపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రేమించేలా చేసిందని తెలిపాడు. అటుపై తాను తప్పని చెబుతున్నా బలవంతంగా తనతో శారీరక సంబంధం కొనసాగించిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆమె గర్భవతి కూడా అయిందని చెప్పాడు.
ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు తనను బెదిరించి రూ. 30 వేలు తీసుకుని ఆమెకు గర్భప్రావం చేయించారని చెప్పాడు. కాగా, ఆ తర్వాత కూడా తనతో సంబంధం కొనసాగించిందని తెలిపాడు. ఆమె బాగోగులు కోసం తాను రూ. 5 లక్షల వరకూ ఖర్చు చేసినట్లు చెప్పాడు.
కొంత కాలంగా తన నుంచి దూరంగా ఉంటోందని, ఆమె తల్లిందండ్రులు ఆ యువతిని హాసన్లో ఉంచారని తెలుసుకుని అక్కడకు వెళ్లి గాలించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
డబ్బు పోయినందుకు తనకు బాధ లేదనీ, ఇప్పుడు తన శీలం పోయిందని వాపోయాడు. మరొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయమై యువతిపై రేప్ కేసు పెట్టండంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం ఈ తరహా కేసులు నమోదు చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు సోమవారం మీడియాను ఆశ్రయించాడు.
ప్రేమ పేరుతో మోస పోయిన ఘటనలో మహిళలు తాము అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకునే పోలీసులు... పురుషుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించాడు.
తన శీలాన్ని ఆమె దోచుకుందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు శివకుమార్ కోరుతున్నాడు. ఆ యువతిపై అత్యాచారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, లేదా ఆమెతో తనకు వివాహం జరిపించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు.