కాళ్లకు మైక్రోచిప్తో పావురం: పాక్ పనేనా?
న్యూఢిల్లీ: గుజరాత్లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో కాలుకు మైక్రోచిప్ కట్టి ఉన్న ఓ పావురాన్ని భద్రతా సిబ్బంది కనుగొన్నారు. మరో కాలుకు కోడ్ నంబర్తో ఉంగరం, రెక్కలపై రాతలు ఉన్న ఈ పావురం తీరు అనుమానం రేకెత్తించడంతో, భద్రతా సిబ్బంది దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తీర ప్రాంత భద్రతా దళం, అటవీశాఖ కేంద్ర హోం శాఖకు ఒక నివేదికను పంపారు.
ఈ విషయాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఫోరెన్సిక్ విభాగాన్ని, ఉగ్రవాద వ్యతిరేక దళాన్ని రంగంలోకి దించింది. ఈ పావురాన్ని తొలుత మార్చి 20న దేవభూమి ద్వారక జిల్లా సరిహద్దు నుంచి ఐదు నాటికల్ మైళ్ల దూరంలో చూశారు.
అక్కడ నిర్మాణంలో ఉన్న జెట్టీ వద్ద కాపలా కాస్తున్న ఓ గార్డు దానిని బంధించాడు. ఒక కాలుకు మైక్రోచిప్ కట్టి ఉండగా, మరో కాలుకున్నరింగుపై 28733 నంబర్ రాసి ఉంది. ఒక రెక్కపై అరబిక్ భాషలో రసుల్-ఉల్-అల్లాహ్ అని, చిప్పై బెంజింగ్ డ్యుయల్ అని రాసి ఉంది.
ప్రస్తుతం ఈ పావురం వడినార్ మెరైన్ పోలీస్స్టేషన్ కస్టడీలో ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. పూర్వకాలంలో సమాచారం చేరవేతకు పావురాలను ఉపయోగించేవారని మనకు తెలుసు. అయితే ఈ పావురం ఇన్ని రహస్యాలను మూటగట్టుకొని ఎందుకొచ్చిందన్న దానిపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. దాయాది పాకిస్థాన్ ఏవైనా రహస్యాలను చేరవేసేందుకు పావురాన్ని ఉపయోగించుకుంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.