షాకింగ్: ఐసిస్ కంటే 'హిజ్బుత్ తెహ్రీర్' ప్రమాదకరం
వాషింగ్టన్: ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హిజ్బుత్ తెహ్రిర్ అత్యంత పకడ్బందీగా తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తోందని.. ఇది ఇస్లామిక్ స్టేట్ (ఐస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కంటే ఎక్కువ ప్రమాదం కానుందని ఓ నివేదిక వెల్లడించింది. భారత్తో పాటు ప్రపంచ దేశాలకు దీని వల్ల పెనుముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.
దీనివల్ల దక్షిణాసియా మరీ ముఖ్యంగా భారతదేశానికి దీంతో పెనుముప్పు పొంచి ఉందంటున్నారు. ఇందుకు కారణం, ఇది అత్యంత తెలివిగా, బయటికి ఎవరికీ కనిపించకుండా అంతర్గతంగా తన భావజాలాన్ని, నెట్వర్క్ను వ్యాప్తి చేస్తుండడమేనని వెల్లడైంది. అమెరికాలోని గ్లోబల్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ కొలాబరేషన్ ఆన్లైన్ వెలువరించే సీటీఎక్స్ జర్నల్ తాజా సంచికలో ఓ నివేదికను ఉటంకిస్తూ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించారు.
వ్యూహాత్మక, భద్రతా వ్యవహారాలపై ఈ జర్నల్ కథనాలను ప్రచురిస్తుంది. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థకు చెందిన సురేందర్ కుమార్ సింగ్ ఈ నివేదికను తయారు చేశారు. ఐసిస్ సిరియా, ఇరాక్లకు మాత్రమే పరిమితమని, అమానవీయ చర్యల ద్వారా అది మీడియా దృష్టిని ఆకర్షిస్తోందని, కానీ, హిజ్బుత్ తెహ్రీర్ అలా కాదని, చాప కింద నీరులా ఇది తన కార్యకలాపాలను విస్తరిస్తోందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే దీని లక్ష్యమని, ఇందుకు ప్రపంచవ్యాప్తంగా యువకులకు ఉగ్రవాదం నూరిపోస్తోందని, అత్యంత తెలివిగా, ప్రపంచ దేశాల స్ర్కూటినీ నుంచి తప్పించుకుని ఇప్పటికే ఇది దాదాపు 50 దేశాల్లో తన నెట్వర్క్ను విస్తరించిందని, ప్రపంచవ్యాప్తంగా దీనికి పది లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరి సంఖ్య ఐసిస్ సభ్యుల కంటే చాలా ఎక్కువని ఆ జర్నల్ స్పష్టం చేసింది.
ఈ సంస్థలో ఒక ఆయుధ విభాగం కూడా ఉందని, దాని పేరు హర్కతుల్ ముహోజిరిన్ఫి బ్రిటానియా అని పేర్కొన్నారు. కెమికల్, బ్యాక్టీరియోలాజికల్, బయోలాజికల్ యుద్ధంలో ఇది శిక్షణ ఇస్తూ ఉంటుందని, అందుకే, ఐసిస్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా ఇది రూపుదాల్చే అవకాశం ఉందని జర్నల్ హెచ్చరించింది. దీనిని 1952లో జెరూసలేంలో ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది.
దీనికి మధ్య ఆసియా, దక్షిణాసియా, ఈశాన్య ఆసియా మరీ ముఖ్యంగా ఇండోనేసియా, యూరప్ల్లో దీనికి శాఖలు ఉన్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ల్లో ఇది వేలూనుకుంది. భారత్లో కూడా ఇది అడుగు పెట్టినా, ఇప్పటి వరకూ నిర్దిష్ట ప్రభావం ఏదీ చూపలేదని ఆ జర్నల్లో వివరించారు. అయితే, పొరుగునే ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ల్లో ఇది విస్తరిస్తుండడం భారత్తోపాటు ప్రపంచ దేశాలకు కూడా ప్రమాదకరమని వివరించింది.
ఇజ్రాయెల్లో అత్యాచారాలకు వ్యతిరేకంగా 2010లో ఢిల్లీలోని బాట్లా హౌస్ వద్ద ప్రదర్శన నిర్వహించామని ఈ ఉగ్రవాద సంస్థ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఆ నిరసనకు వెయ్యిమంది హాజరయ్యారు కూడా. భారత్లో వెలుగులోకి వచ్చిన చివరి కార్యక్రమం ఇదేనని పేర్కొన్నారు. అయితే, ఐసిస్కు, ఈ ఉగ్రవాద సంస్థకు సైద్ధాంతిక సారూప్యతలు ఉన్నాయని, ఐసిస్ను సమర్థించే వారంతా దీనిని కూడా సమర్థిస్తారని చెబుతున్నారు.
కానీ, ఐసిస్తో పోలిస్తే ఇది వ్యూహాలు విభిన్నమని కథనంలో వివరించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉండి విద్యావంతులైన యువతను ఇది ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో ఇప్పటికే అనేక మంది మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు దీనికి మద్దతు తెలిపారని, కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం 2009లోనే దీనిని నిషేధించిందని వివరించారు.
పాకిస్థాన్లో 1990లో దీనిని నెలకొల్పారని, ముషారఫ్ హత్యకు కుట్ర సహా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పావులు కదుపుతోందని పాకిస్థాన్లోనూ 2003లో దీనిని నిషేధించారు. స్థానిక పారిశ్రామికవేత్తలు, ఇస్లామిక్ చారిటీ సంస్థల ద్వారా ఇది నిధులను సమీకరిస్తోందని తెలిపారు. అరబ్ దేశాల్లోని సంపన్న షేకులు కూడా దీనికి పెద్దఎత్తున నిధులు సమకూరుస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని అంటున్నారు.