బీజేపీలోకి అవుననట్లేదు, కాదనట్లేదు: గంగూలీ ట్విస్ట్
కోల్కతా: భారత క్రికెట్ మాజీ సారథి సౌరవ్ గంగూలీ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తల పైన గంగూలీ ఆచితూచి స్పందించారు. తాను కమలం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల పైన మాట్లాడేందుకు నిరాకరించారు.
చేరిక ప్రచారంపై గంగూలీ స్పందిస్తూ.. నో కామెంట్స్ అన్నారని కటువుగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ట్విట్టర్లో ఆర్పీజీ సంస్థ చైర్మన్ హర్షాగోయెంకా ఏం ప్రస్తావించారో తెలియదని, దీనికి సంబంధించిన వివరాలు ఉంటే ఆయననే అడగాలని గంగూలీ చెప్పారు. అతని ట్వీట్తో తాను ఆశ్చర్యానికి లోనయ్యానని, ఆయనతో తనకు చాలా రోజులుగా పరిచయం ఉందని, అలాగే ఇటీవల ఆయనను కలవక చాలా రోజులు అవుతోందని చెప్పారు.
అదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు అత్యంత గౌరవం ఉందని చెప్పారు. ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మంచి ప్రాజెక్ట్ అన్నారు. మహాత్ముడు కల గన్న స్వచ్ఛ భారత్ మనం సాధిస్తే అది చాలా గొప్ప విషయమన్నారు.
బీజేపీలో చేరిక విషయం పైన ఖండించలేదు.. అలాగని సమర్థించలేదు. దీని పైన తాను అవునని చెప్పడం లేదని లేదా లేదని చెప్పడం లేదన్నారు. అయితే, ఆ ట్వీట్ మాత్రం సరికాదన్నారు. కాగా, బీజేపీ తనకు అవకాశం ఇచ్చిందని, కానీ తిరస్కరించానని, ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన వ్యాఖ్యానించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.