భారత్ హిందూదేశం: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
న్యూఢిల్లీ: భారత దేశం హిందూ దేశమని, హిందువులు అందరూ సంఘటితమయ్యేందుకు ఇదే మంచి తరుణమని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ శనివారం వ్యాఖ్యానించారు. మీరట్, ఘజియాబాదులలో ఆదివారం ఆయన ఆరెస్సెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
హిందువులకు, ముస్లీంలకు మధ్య వివాదం తలెత్తినప్పుడు మధ్యేమార్గం ఉద్భవిస్తుందని చెప్పారు. అదే హిందుత్వ మార్గమని విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ చెప్పారని గుర్తు చేశారు.
మనం చేయాల్సింది మనకు స్పష్టంగా తెలిసి ఉండాలని, మనలో మనం కలహాలు సృష్టించుకుంటే ఈ రాజ్యాంగం మనలను కాపాడలేదని చెప్పారు. ప్రతికూల పరిస్థితులలోను ఆరెస్సెస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ ఆరెస్సెస్ శాఖలను ప్రారంభించి హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు కృషి చేశారన్నారు. ఇప్పుడు ఆరెస్సెస్కు సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
ఆరెస్సెస్ ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు ప్రపంచంలోనే ఏ ఇతర సంస్థలు వారి వారి దేశాల్లో ఎదుర్కొనలేదన్నారు. స్వయంసేవక సంఘ్ మాత్రం భారత దేశంలోనే అన్ని ఎదురుదెబ్బలు ఎదుర్కొందన్నారు.