ఎల్ఎల్ఎం పరీక్షలో కాపీ కొట్టిన ఐజి: డిబార్?
కొట్టాయం: అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత గల ఓ పోలీసు ఉన్నతాధికారే పరీక్షలో చూచిరాతకు పాల్పడ్డారు. సాక్షాత్తు ఐజీ హోదాలో ఉన్న టిజె జోస్ అనే అధికారి.. కేరళలో జరిగిన ఎల్ఎల్ఎం పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డట్టు నిర్ధారణ అయ్యింది.
ఇక్కడి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి చెందిన ఉపసంఘం ఒకటి ఈ మేరకు తేల్చింది. మంగళవారం తన నివేదికను ప్రో ఉపకులపతి షీనా షకూర్కు కమిటీ సమర్పించింది.
'ఇన్విజిలేటర్లు, విద్యార్థుల నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం.. ఐజీ టిజె జోస్ చూచిరాతకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది' అని కమిటీలోని సభ్యుడొకరు తెలిపారు. ఈ ఏడాది మే 4న కలామెస్సరీలోని సెయింట్ పాల్స్ కళాశాలలో ఈ పరీక్ష జరిగింది.
కమిటీ నివేదిక ఆధారంగా యూనివర్సిటీ పాలక మండలి తన తదుపరి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనుంది. మూడేళ్ల పాటు పరీక్ష రాయకుండా ఆయనను డిబార్ చేసే అవకాశం ఉంది. ఐజీపై శాఖపరమైన విచారణ కూడా జరుగుతోంది.