హైకోర్టు జడ్జిలు భయంతో పనిచేస్తున్నారు: తీవ్ర వ్యాఖ్య
చెన్నై: మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తులు భయంతో పని చేస్తున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మద్రాసు హైకోర్టులో పరిస్థితి పైన ఆయన తీవ్రంగా స్పందించారు.
అక్కడ కొందరు న్యాయవాదులు చట్టానికి అతీతంగా పని చేయడంతో జడ్జిలు భయంతో పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో కొందరు న్యాయవాదులు ప్రదర్శనగా వచ్చి నినాదాలు చేసిన పరిస్థితి పైన సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ కోర్టుకు వివరించారు.
మరికొందరు న్యాయవాదులు తమ కుటుంబ సభ్యులను కోర్టులోకి తీసుకు వచ్చి, ఇబ్బంది పెడుతున్నారని, అలాగే జడ్జిలను తిడుతూ పనికిమాలిన ఫిర్యాదులు చేస్తున్నారన్నారు.
ఈ మొత్తం పరిస్థితి పైన తాను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్తో చర్చించానని, అయితే, దీనిపై ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వాటివల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని, అందువల్ల చర్యలు తీసుకునే ముందు కాస్త వేచిచూద్దామని జస్టిస్ దత్తు అన్నారు.
తమిళాన్ని కోర్టులో అధికార భాషగా చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారని, అది ఎలా సాధ్యమన్నారు. తాము యువ న్యాయవాదులుగా ఉన్నప్పుడు సీనియర్ల వద్ద నేర్చుకున్నామన్నారు. మద్రాసు హైకోర్టులో ఉన్నత విలువలు పాటించేవారమన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవారు మద్రాసు హైకోర్టుకు వెళ్లి నేర్చుకోమని చెప్పగలమా అన్నారు.