ధోనీ గ్రేట్, చూసి బుద్ది తెచ్చుకోవాలి: కపిల్ సంచలనం
కోల్కతా: భారత క్రికెట్ మాజీ సారథి కపిల్ దేవ్ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం తమ కుర్చీలను అట్టిపెట్టుకుని ఉండే క్రీడా పాలకులు మహేంద్ర సింగ్ ధోనీని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. టెస్టుల నుండి సరైన సమయంలో ధోనీ తప్పుకొని, అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.
ఎవరైనా ఆడాలనుకుంటే రెండువందల టెస్టులు కూడా ఆడవచ్చునని చెప్పారు. కానీ ధోనీ మాత్రం అలా చేయలేదన్నారు. తాను చేయగలిగింది చేశా, ఇక తర్వాత తరం ఆడుకోనివ్వండి అంటూ సంకేతాలిస్తూ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడన్నారు. అందుకు తాను ధోనీని అభినందిస్తున్నానని చెప్పారు.
అతనో గొప్ప వ్యక్తి అన్నారు. క్రికెట్కు ఎంతో చేశాడన్నారు. ధోనీ కనీసం వందో టేస్టు దాకా ఆడాలని మనమందరం అనుకున్నామని, కాని అతను నూతనంగా ఆలోచించాడన్నారు. జీవితమంతా ఆడుతూనే ఉండాలని ఎవరు అనుకోకూడదన్నారు.
తర్వాత తరం వస్తుందని తెలిశాక రిటైరవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా కపిల్.. గ్రెగ్ చాపెల్ చేసిన ఓ మాట చెప్పారు. 'ఓ ఆటగాడు తన సమయం దాటిపోయాక కూడా కొనసాగితే.. తర్వాత మూడు తరాలకు నష్టం చేకూర్చినట్లే' అని చాపెల్ అన్నాడన్నారు. ఈ మాటను తాను గౌరవిస్తానని చెప్పారు. క్రికెట్ పాలకులు కూడా 30 ఏళ్లు లేదా జీవితాంతం కుర్చీలకు అతుక్కోవద్దని, ధోనీని చూసి బుద్ది తెచ్చుకోవాలన్నారు.