జాతీయ గీతాన్ని అవమానపర్చిన కర్ణాటక గవర్నర్
బెంగుళూరు: 'జనగణమన' జాతీయ గీతం వినిపిస్తుంటే కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా వేదిక మీద నుంచి కిందకు దిగడం తీవ్ర వావాదానికి దారి తీసింది. కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారానికి మంగళవారం ఆయన హాజరయ్యారు.
ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతీయ గీతాన్ని వినిపించడం మొదలు పెట్టారు. జాతీయ గీతాన్ని వినిపించుకోకుండా వడివిడిగా వేదిక దిగి వెళ్లిపోతున్న వాజూభాయ్ వాలాకు అధికారులు విషయాన్ని వివరించగా తిరిగి ఆయన వేదికపైకి వచ్చి నిలబడ్డారు.
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నిలబడి జాతీయ గీతానికి గౌరవ వందనం ఇస్తుండగా, ఆయన వేదిక నుంచి కిందకు దిగిన దృశ్యాలను స్ధానిక టీవీ ఛానెల్స్ ప్రముఖంగా చూపించాయి.
దీంతో ఆయన వ్వవహారశైలిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే ఈ సంఘటనపై కర్ణాటక రాజ్ భవన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.