మందలింపు సరిపోదు, ఉరితీయండి: జస్టిస్ కట్జూ
న్యూఢిల్లీ: తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రాజ్యసభలో ఖండించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తీవ్రంగా స్పందించారు. విదేశాల్లో ఉన్న ఆయన దీనిపై మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలపై ఖండిస్తూ తీర్మానం చేయడం ఏమాత్రం సరిపోదని, చేతనైతే తాను దేశానికి వచ్చిన వెంటనే ఉరితీయాలని అన్నారు.
తనకు వస్తున్న ఆర్థిక, ఇతరత్రా ప్రయోజనాలను కూడా నిలిపివేయాలని సూచించారు. అలా నిలిపేయాలంటూ నిబంధనలు సవరించాలని, తాను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తినన్న విషయం మరువొద్దని కట్జూ తెలిపారు.
తాను విదేశాల నుంచి తిరిగి రాగానే అరెస్ట్ చేసి, ఆ తర్వాత వెంటనే ఉరితీయాలంటూ ఎంపీలు ఓ తీర్మానం ఆమోదించాలని అన్నారు.
ఇటీవల ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత గాంధీజీ బ్రిటీష్ ఎజెంట్ అని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ను జపనీయుడిగా వ్యవహరించారని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభ తీర్మానం కూడా చేసింది.