గుట్టు విప్పిన శ్రీధర్: కెసిఆర్ పుస్తకాల పురుగు!
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పుస్తకాల పురుగు అనేది చాలా మంది కర్ణాకర్ణిగా విన్న మాటే. ఆయనకు పుస్తక పఠనం ఓ వ్యసనం లాంటిది అనేవారు కూడా ఉన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆ విషయాన్ని ధ్రువీకరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ 70 వేల పుస్తకాలు చదివారని ఆయన కచ్చితంగా చెప్పేశారు. పుస్తక పఠనం ద్వారా నేర్చుకున్న విజ్ఞానంతో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తున్నారని ఆయన కొనియాడారు. వరంగల్లోని చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల (సికిఎం) వార్షికోత్సవ సభలో ఆయన సోమవారంనాడు ప్రసంగించారు.
ఆ వార్షికోత్సవాలకు శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీధర్ వరంగల్ జిల్లాకు చెందినవారే. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని అలవరుచుకోవచ్చునని ఆయన అన్నారు. దేశంలో విద్య కమ్యూనికేషన్ ద్వారా సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అందరూ వదిలేసినా తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమించిన ఏకైకా వ్యక్తి తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి అని ఆయన అన్నారు. ఈ వార్షికోత్సవంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ప్రిన్సిపాల్ ఉపేంద్ర శాస్త్రి పాల్గొన్నారు.