వాస్తు ఎఫెక్ట్: 'కేసీఆర్ మూఢనమ్మకంపై హైకోర్టుకు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సచివాలయ మార్పు నిర్ణయం పైన తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయానికి వాస్తు బాగా లేదని, మార్చనున్నట్లు కొద్ది రోజుల క్రితం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
దీని పైన విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఇన్నాళ్లు అదే సచివాలయంలో పాలన జరిగిందని చెబుతున్నారు. వాస్తు పేరుతో సచివాలయం మార్పు చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ మూఢనమ్మకాల పైన తాము పోరాడుతామని హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం చెప్పారు. కేసీఆర్ వాస్తు నిజమని ప్రజలకు నిరూపించాలని బొజ్జా తారకం శనివారం డిమాండ్ చేశారు. కేసీఆర్ మూఢనమ్మకాలతో అశాస్త్రియమైన అంశాలను ప్రోత్సహిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
దీని పైన తాము త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జన విజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో వాస్తు పాలన రాజ్యాంగ విరుద్ధం అంశంపై రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జా తారకం మాట్లాడారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రాజ్యాంగ బద్ధంగా చేశారని గుర్తు చేశారు. కేసీఆర్కు పాలించే హక్కు లేదన్నారు. కేసీఆర్ పాలన శాస్త్రీయంగా ఉండాలే తప్ప అశాస్త్రీయంగా ఉండవద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఛాయారతన్ అన్నారు.