అప్పుడే షాక్!: ఓటమిపై కిరణ్బేడీ కొత్తకారణం.. ఫత్వా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నాయకురాలు కిరణ్ బేడీ తన ఓటమికి మరో కొత్త కారణం చెప్పారు! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఆమె పలుమార్లు మాటలు మార్చిన విషయం తెలిసిందే. తొలుత ఓటమికి తానే బాధ్యురాలిని అని తెలిపారు. ఆ తర్వాత ఇది తన ఓటమి కాదని, బీజేపీ ఓటమి అన్నారు.
ఆ తర్వాత పార్టీకి ఓటమిపై క్షమాపణలు చెప్పారు. తాజాగా, ఆమె ఓటమిపై మరో కొత్త కారణం చెప్పారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ పోలింగ్కు ఒక్కరోజు ముందు జామామసీదు షాహీ ఇమామ్ సయ్యద్ బుఖారీ ఫత్వా జారీ చేయడంపై ఎన్నికల సంఘం దర్యాఫ్తు చేయాలని కిరణ్ బేడీ డిమాండ్ చేశారు.
బుఖారీ ఫత్వా ప్రభావం ఢిల్లీ ఓటర్ల పైన ఉందా లేదా అన్నది పరిశీలించాలని తెలిపారు. కిరణ్ బేడీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణానగర్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. దీనిపై ఆమె బుధవారం మాట్లాడారు.
ఓట్ల లెక్కింపులు తాను తొలి నుండి ఆధిక్యంలో ఉన్నానని, ముస్లీముల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత ఆధిక్యం తగ్గిపోవడం మొదలైందని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం చవి చూసిన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మిగతా 67 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కిరణ్ బేడీ ఏఏపీ నేత ఎస్కే బగ్గా పైన రెండువేలకు పైచిలుకు ఓట్లతో మాత్రమే ఓడారు.