కల్లు దొరక్క వింత చేష్టలు: మంచాలకు కట్టేశారు
నిజామాబాద్: ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు ఆస్పత్రిపాలైన ఘటన మరువకముందే అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మందు దొరక్కపోవడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు మాక్లూర్, బాన్సువాడ, బోధన్, వర్ని, ఎడపల్లి, నవీపేట్ మండలాలకు చెందిన సుమారు 55 మంది మందుబాబులు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
కాగా, కల్తీ కల్లుకు బానిసై.. గత శనివారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న చిన్నయ్య అనే వ్యక్తి 90 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కల్లు దొరక్కపోవడంతోనే బీడీ కంపెనీలో పని చేస్తున్న చిన్నయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణాంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మందుబాబులు పది రోజులుగా మందు కలిపిన కల్లు దొరకక.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండడంతో వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వీరి పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది.
కాగా, వీరు చికిత్సకు కూడా సహకరించడం లేదు. వైద్యులు చెప్పేది వినడం లేదు. ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నించడంతో వారిని మంచాలకు కట్టివేసి వైద్యులు చికిత్స చేస్తున్నారు.
వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్పత్రిలో ఒక్కొక్క బాధితుడూ ఒక్కోరకంగా ప్రవర్తిస్తుండడంతో.. వారితోపాటు ఉండేవారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మందు కల్లు ప్రభావం వల్ల వారి మెదడు స్తబ్దుగా మారి నరాలపై ప్రభావం చూపుతోందని, దాని వల్లనే వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వైద్యులు డాక్టర్లు తెలిపారు. వీరికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలూ చేపట్టామన్నారు.
పిచ్చిగా ప్రవర్తించే వారు సాధారణ స్థితికి వచ్చేందుకు 72 గంటలు పడుతుందని ఆయన తెలిపారు. అప్పటి వరకు కుటుంబసభ్యులు అండగా ఉండి వైద్య సేవలకు సహకరించాలన్నారు. కాగా.. జిల్లాలో వ్యాపారులు ప్రాణాంతకమైన మత్తు పదార్థాలతో కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విపక్ష నాయకులు మండిపడుతున్నారు.