మాణిక్యాల రావును పక్కన పెట్టిన బాబు?
హైదరాబాద్: దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై బిజెపి వర్గాలు, విహెచ్పి వర్గాలు కినుక వహించినట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా ఆయనను చంద్రబాబు ఏ విధమైన ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు.
పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అప్పగించి దేవాదాయ శాఖను నిర్వహిస్తున్న మాణిక్యాల రావును మాత్రం విస్మరించారని అంటున్నారు. మాణిక్యాల రావు బిజెపికి చెందినవారు కావడం వల్లనే ఆ పార్టీకి ప్రాధాన్యం దక్కకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరించినట్లు మండిపడుతున్నారు.
దేవాదాయ శాఖ వ్యవహారాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై మాణిక్యాల రావు గతంలో ఓసారి మంత్రివర్గ సమావేశంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం సరి కాదని విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) అంతర్జాతీయ అధ్యక్షుడు గుణంపల్లి రాఘవ రెడ్డి అన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో జరుగుతున్న విహెచ్పి దాక్షిణాంధ్ర వర్షాకాల సమావేశాలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్కరాల్లోనే కాకుండా అన్ని ఆలయాలూ చంద్రమయం అయ్యాన్ని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.