పురోహితుడు లేని పెళ్లి చట్ట విరుద్ధం కాదు: హైకోర్టు
చెన్నై: పురోహితుడితో నిమిత్తం లేకుండా ఆత్మగౌరవం పద్ధతిలో జరిగే వివాహం చట్టవిరుద్ధం కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. 1968లో హిందూ వివాహ చట్టానికి నాటి తమిళనాడు ప్రభుత్వం చేసిన సవరణను హైకోర్టు తాజాగా మరోసారి గట్టిగా సమర్థించింది.
1968 నాటి సవరణను సవాల్ చేస్తూ అసువథమన్ అనే లాయర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. హిందూమతం రకరకాల సంస్కృతుల సమ్మేళనమని, ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి ఒక్కోచోట వివాహం సంప్రదాయం ఒక్కోరకంగా ఉంటుందని పేర్కొంది.
ఇది తరతరాల నుంచీ వస్తున్న సంప్రదాయమని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానంలతో కూడిన ధర్మాసనం చెప్పింది.
ఇరు పక్షాల బంధుమిత్రుల సమక్షంలో వధూవరులిద్దరూ పూలమాలలను మార్చుకోవడం లేదా పరస్పరం ఉంగరాలు మార్చుకోవడం లేదా మంగళసూత్రాన్ని కట్టేయడం ద్వారా పెళ్లి సమాప్తం అవుతుందని పేర్కొంది. పండితుడు లేకపోయినా వివాహం చేసుకోవచ్చునని కోర్టు చెప్పింది.
ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం కూడా ఎప్పుడో చెప్పింది. ఈ మేరకు చట్టాన్ని సవరించిన విషయాన్ని హైకోర్టు ధర్మాసనం పునరుద్ఘాటించింది.