ఆంధ్రప్రదేశ్ సీఎం కెసిఆర్ అని నాలుక్కర్చుకున్నారు!
హైదరాబాద్: స్టార్టప్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా నాస్కామ్ తెలంగాణ రాష్ట్ర శాఖ చైర్మన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పొరపాటుగా... ఏపీ సీఎం అంటూ పేర్కొన్నారు.
భారత పారిశ్రామిక దిగ్గజంరతన్ టాటా, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తదితరులు టీ హబ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు.
ఈ సందర్భంగా నాస్కామ్ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సీఎం కెసిఆర్ను... ఏపీ సీఎంగా సంభోదించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. పలువురు నవ్వేశారు. అనంతరం తేరుకున్న ఆయన.. వెంటనే తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు. తెలంగాణ సిఎం అంటూ కొనసాగించారు.
కాగా, నాస్కాం చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... టీ-హబ్కు తాము తోడ్పాటును అందిస్తామన్నారు. పదివేల స్టార్టప్ పరిశ్రమలను స్థాపించే లక్ష్యంలో భాగంగా టీ-హబ్ను నాస్కాం వినియోగించుకుంటుందని ఆయన తెలిపారు.