'మసీదులు మత స్ధలాలు కావు, ఎప్పుడైనా కూల్చొచ్చు'
గౌహతి: ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో నిలుస్తున్న బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి మరోసారి మతసహనాన్ని భంగపరిచే విధంగా వ్యాఖ్యాలు చేశారు. గౌహతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మసీదులు కేవలం నిర్మాణాలే తప్ప మత స్ధలాలు కావని, వాటిని ఎప్పుడైనా కూల్చేయవచ్చని అన్నారు.
ఇస్లాంను పూర్తిగా విశ్వసించే గల్ఫ్ దేశాల్లో సైంత రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదుల్ని కూలగొడతారని ఆయన గుర్తు చేశారు. ఇండియాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విషయంపై ఎవరితోనైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీనిపై సౌదీ అరేబియా ప్రజల నుంచి తనకు సమాచారం ఉందని అన్నారు. ఇది ఇలా ఉంటే సుబ్రమణ్య స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ సంఘాలతో పాటు బీజేపీ అసోం శాఖ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అసోం బీజేపీ అధ్యక్షుడు సిద్దార్ధ భట్టాచార్య ఈ విషయంపై మాట్లాడుతూ స్వామి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. కేంద్రంలో ఉన్న లీడర్లకు స్వామి చేసిన వ్యాఖ్యల పుటేజీ వీడియోని పంపనున్నట్లు తెలిపారు.
మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుబ్రమణ్య స్వామి మరోసారి అసోం రాకుండా నిషేధం విధించాలని కిసాన్ ముక్తి సంగ్రామ్ సమితి డిమాండ్ చేసింది. సుబ్రమణ్య స్వామిపై ఐపీసీ 120 (బీ), 153 (ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అసోం పోలీసులు వెల్లడించారు.
సుబ్రమణ్య స్వామి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలో శశిథరూర్ నుంచి సోనియా గాంధీ వరకు ఒక్కొక్కరిని టార్గెట్గా చేసుకొని స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.