ఇదే దుస్థితి!: కుర్చీ విరిగి కిందపడ్డ ఆంధ్రా ఎంపీ, సారీ
విశాఖపట్నం: కుర్చీ విరిగి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు కిందపడిన సంఘటన గురువారం నాడు జరిగింది. ఆయనకు ఈ చేదు అనుభవం వన్ టౌన్లోని ఘోషా ఆస్పత్రిలో ఎదురైంది.
ఆసుపత్రిలో సమస్యలు తెలుసుకునేందుకు ఎంపీ హరిబాబు గురువారం ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో అధికారులు ఆయనకు పొరపాటున విరిగిపోయిన కుర్చీ వేయడంతో అందులో కూర్చున్న హరిబాబు కింద పడిపోయారు.
అయితే, అది విరిగినట్లుగా గుర్తించలేకపోయారు. దానిలో కూర్చున్న ఎంపీ కాస్త వెనక్కి వాలారు. దీంతో అది విరిగి, ఆయన నేల మీద పడిపోయారు. ఆసుపత్రి సిబ్బంది ఆయనను పైకి లేపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కుర్చీ దుస్థితిలోనే ఆసుపత్రి ఉందని వ్యాఖ్యానించారు.
కాగా, వెంటనే అధికారులు పొరపాటును గుర్తించి ఎంపీ హరిబాబును క్షమాపణ కోరారు. అనంతరం ఆస్పత్రిలోని గర్భిణిలు, బాలింతలు, శిశువుల వార్డును సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి కావాలసిన ఆధునిక పరికరాల కొనుగోలుకు ఎంపీ నిధుల నుంచి రూ.15 లక్షలు కేటాయించనున్నట్లు హరిబాబు ప్రకటించారు.