కొందరు ముస్లీం నేతలపై విహెచ్పి నేత సంచలనవ్యాఖ్య
ఢిల్లీ: రాజకీయ పార్టీలలోని పలువురు ముస్లీం నేతలను ఉద్దేశించి విశ్వహిందూ పరిషత్ నాయకుడు సురేంద్ర కుమార్ జైన్ శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశాన్ని బెదిరించేందుకు వారు ఉగ్రవాదులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వారికి భారత దేశంలో ఉండే హక్కు లేదన్నారు. జిహాదీ ఆలోచన తీరు ఉన్న రాజకీయ నేతలు, చర్చిలు... మతం పేరుతో దేశానికి చెడ్డపేరు వస్తోందన్నారు. కొన్నిసార్లు అబు అజ్మీ, మరికొన్నిసార్లు అజాం ఖాన్ మతం పేరుతో ఉగ్రవాదులకు మార్దదర్శకులుగా వ్యవహరిస్తున్నారన్నారు.
హిందూమతాన్ని వ్యతిరేకించే క్రమంలో వీరు రాజ్యాంగాన్ని, దేశాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ముస్లీం వ్యక్తి కావడం వల్లే మరణ శిక్షను ఎదుర్కొంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు.
బజరంగ్ దళ్ జాతీయ సదస్సు కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకుముందు బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ మాట్లాడుతూ... యాకుబ్ మెమన్ ఉరిశిక్షను ఆమోదించని వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.