బాలయ్యపై అవినీతి ఆరోపణలు: కరపత్రాల వెనుక ఎవరు?
అనంతపురం: గత కొన్ని రోజులుగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వ్యతిరేకంగా కొన్ని కరపత్రాలు పట్టణంలో కనిపించడంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి కనుమూరి శేఖర్, టిడిపి నేత గ్రీన్పార్క్ నాగరాజు, అధికారిక పిఎ బాలాజీలపై వరుసగా అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ నిజ నిర్ధారణ కమిటీ పేరిట కరపత్రాలు వెలిశాయి.
తాజాగా ఓ కరపత్రం ముద్రించి హిందూపురంలోని ఎంజిఎం క్రీడా మైదానం తదితర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కుప్పలు తెప్పలుగా వేకువజామున పడవేశారు. గత నెల రోజుల్లో నాలుగు సార్లు ఇలాంటి అవినీతి ఆరోపణలు చేస్తూ హిందూపురంలో వివిధ చౌరస్తాల్లో కరపత్రాలు కనిపించడం పెద్ద దుమారం రేపుతోంది.
దీంతో ఈ కరపత్రాల అంశం చిలికిచిలికి గాలివానలా తయారుకావడంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ అంశంపై దృష్టి పెట్టారు. ఇటీవల బాలకృష్ణ హిందూపురంలో పర్యటించిన సందర్భంగా ఈ కరపత్రాల అంశాన్ని ఆయన వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
అయితే బాలయ్య స్పందిస్తూ రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని, పట్టించుకోవద్దని, అభివృద్ధి విషయంలో ముందుకెళ్లాలని సూచించినట్లు చర్చ జరిగింది. అయితే కొద్ది రోజుల్లోనే రెండు దఫాలుగా కరపత్రాలు మళ్లీ గుర్తు తెలియని వ్యక్తులు ముద్రించి పడవేయడం పట్ల బాలకృష్ణ దృష్టికి వెళ్లగా తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
కరపత్రాల అంశంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని పిఎలు శేఖర్, బాలాజీలకు బాలకృష్ణ ఆదేశించినట్లు చెబుతున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. విచారణ చేపట్టిన ఎస్పీ నిందితులను గుర్తిస్తామని చెప్పినట్లు పేర్కొంటున్నారు.
ఇందులో భాగంగా రహస్యంగా కరపత్రాల ఎవరు పంపిణీ చేశారనే విషయంపై దృష్టి పెట్టారు. వివిధ వర్గాలతో దీనిపై ఆరా తీస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు నిఘా వర్గాల ద్వారా విషయాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కరపత్రాల అంశంపై అటు బాలకృష్ణ అభిమానులు, ఇటు టీడీపీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు.