చంద్రబాబు షాడో: తదుపరి టార్గెట్ జనార్ధన్?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో కొత్త పేరు వెలుగు చూసింది. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు జరిగిన వ్యవహారం సందర్భంగా సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్యలు తమ మాటల్లో పదే పదే జనార్దన్సార్.. అంటూ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అత్యంత సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. ఆయనను చంద్రబాబు షాడోగా అభివర్ణిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తనుంచి అధ్యక్షుడి వరకు ఏ మెసేజ్ వెళ్లాలన్నా ఈ జనార్దన్ అనే వ్యక్తి కీలకమని అంటున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఆయన చెపితేనే బాబు ముందుకు వెళతారనేది వారి అభిప్రాయం. పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారని అంటారు.
జనార్దన్ చెప్పినట్టే చంద్రబాబు డబ్బుల పంపిణీ, పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేయడమో జరుగుతుందని అంటున్నారు. ఇంతటి కీలక స్థానంలో ఉన్న ఆయన ఇటీవలే ఒక పదవి పొందినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. గత సాధారణ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుల్లోనూ జనార్దన్ అనే వ్యక్తి కీలపాత్ర పోషించారని వారు తెలిపారు.
కాగా, సండ్ర, సెబాస్టియన్ల మధ్య సాగిన స్టీఫెన్సన్ డీల్లో జనార్దన్ కూడా కీలకంగా ఉన్నారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సెబాస్టియన్ కాల్ డేటాలో కూడా జనార్దన్ నంబర్లున్నాయని, పదే పదే ఆయన కూడా సెబాస్టియన్తో మాట్లాడారని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో సదరు జనార్దన్ను సైతం ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు ఎసిబి సిద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు కుట్ర ఎక్కడి నుంచి మొదలైందో మరిన్ని వివరాలు రావాలంటే ఆయనను విచారించాల్సి ఉంటుందని తాము ఎసిబి భావిస్తున్నట్లు సమాచారం.
సండ్ర కస్టడీకి కోర్టు అనుమతిస్తే జనార్దన్కు నోటీసులు జారీచేసి, ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాలని ఎసిబి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం డీల్లో స్టీఫెన్సన్కు ఆఫర్ చేసిన రూ.5కోట్ల నగదు కథ జనార్దన్కు తెలిసే ఉంటుందని ఏసీబీ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
పారిశ్రామికవేత్తలు, ఎంపీలు ఈ సొమ్ము ఏర్పాటు చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం ఏమిటనేది జనార్దన్ మాత్రమే చెప్పగలరని విచారణలో నిందితులు ఏసీబీకి తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. దీనితో జనార్దన్ అనే వ్యక్తికి నోటీసులిచ్చి అసలు కథ తేల్చాలనే ఉద్దేశంతో ఏసీబీ అధికారులున్నారు.