రాందేవ్ బాబా పతంజలి నూడిల్స్లో పురుగులు
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా పతంజలి సంస్థ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన నూడిల్స్లో పరుగులు బయటపడ్డాయి. దీంతో పుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పతంజలి సంస్ధకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొంది. వివరాల్లోకి వెళితే, హర్యానాలోని నార్వానా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక దుకాణం నుంచి ఆటా నూడిల్స్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి నూడిల్స్ ప్యాకెట్ను ఓపెన్ చేయగానే అందులో పురుగులు కనిపించాయి.
దీంతో అతడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. వెంటనే దీనిపై దుకాణ యజమాన్ని ప్రశ్నించగా నూడిల్స్ ప్యాకెట్ తమ దుకాణం నుంచి కొనుగోలు చేసిన విషయం వాస్తమేనని కానీ అందులో పురుగులున్నట్లు తమకు తెలియదని పేర్కొన్నాడు. దీనిపై వినియోగదారుడు పతంజలి నూడిల్స్పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ నోటీసుపై పతంజలి సంస్ధ మాట్లాడేందుకు నిరాకరించింది. కాగా, రాందేవ్ బాబా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన అట్టా నూడిల్స్ ఇప్పటి వరకు తమ అనుమతి తీసుకోలేదని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇప్పటి వరకు అలాంటి అనుమతి కోసం రాందేవ్ బాబా దరఖాస్తు కూడా చేసుకోలేదని అధికార వర్గాల సమాచారం.
అయితే రాందేవ్ బాబా ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్ధ అనుమతి పొందినట్లు ఉందని తెలిసింది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని దీనిపై దృష్టి సారించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఛైర్మన్ ఆశిష్ బహుగుణ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే పతంజలి సంస్ధ మాత్రం తాము ఇదివరకే అనుమతులు తీసుకున్నామని, అన్ని నియమ నిబంధనలు పాటించామని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజర్వాలా చెప్పడం విశేషం.