ఉల్లి ధరలు: కేంద్రమంత్రి హర్ సిమ్రాత్ వంటింటి చిట్కా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి! ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో యాభై రూపాయలకు పైగానే పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఉల్లిగడ్డ కొనాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు! అయితే, ఉల్లి ధరల పెరుగు నేపథ్యంలో కేంద్రమంత్రి హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ వంటింటి చిట్కా చెప్పారు.
నిత్యావసరమైన ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో చౌకగా దొరుకుతున్నప్పుడు కొనిపెట్టుకుని, భద్రపరచుకుంటే మేలని ఆమె మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పారు.
అందుకోసం, ఉల్లిపాయల్ని సన్నగా తరిగి నిర్జలీకరించుకోవచ్చనీ, మెత్తని పొడిలాగా చేసుకోవచ్చనని, లేదంటే పేస్టులా చేసి దాచుకోవచ్చని సూచించారు. ధరలు పెరిగినపుడు చటుక్కున వీటిని తీసుకుని హాయిగా వాడుకోవచ్చన్నారు.
ఆసియా మొత్తం మీద ఉల్లిపంట విస్తారంగా పండే మహారాష్ట్రలోని లాసల్గావ్లోనే ఇప్పుడు వాటి టోకు ధర కిలోకి 57గా ఉన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో, పరిశుభ్రంగా శుద్ధి చేసి వాడుకోవడం మంచిదన్నారు.
ఒక్క ఉల్లిపాయలను మాత్రమే కాదని, పండ్లు, కూరగాయలను కూడా దిగుబడి బాగా ఉన్న రోజుల్లో శుద్ధిచేసి భద్రపరచుకుంటే ధరలు పెరిగినపుడు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చన్నారు. త్వరగా పాడైపోయే ఈ తరహా ఆహారపదార్ధాలన్నిటినీ శుద్ధి చేసి దాచుకుంటే డబ్బులు బాగా ఆదా చేసుకోవచ్చన్నారు. కాగా 50 ఎకరాలలో ఫుడ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఆమె చెప్పారు.