ఊగిసలాట: తోటి ఖైదీలకు రేవంత్ వస్తువులు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న తెలుగుదేశం తెలంగాణ పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆశానిరాశల మధ్య ఊగిసలాడారు. బెయిల్ లభించిన ఆనందం ఓ వైపు ఉండగా, సాయంత్రం వరకు జైలు నుంచి బయటకు రావడానికి అవసరమైన లాంఛనాలు పూర్తి కాకపోవడం మరో వైపు నిరాశను కలిగించింది.
గత నెల రోజులుగా రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇంతకాలం అక్కడ తాను వినియోగించిన వస్తువులన్నిటినీ అక్కడి తోటి ఖైదీలకు ఇచ్చేశారు. ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి వినియోగించిన వస్తువులను తమకు ఇవ్వాలని ఖైదీలు కోరారు.
దాంతో తాను వాడిన దిండ్లు, దుప్పట్లు, దుస్తులు, బూట్లువంటి వాటినన్నింటినీ ఆయన అడిగినవారికి అడిగినట్లు ఇచ్చేశారు. అయితే, మంగళవారం రాత్రి కూడా ఆయన అక్కడే ఉండాల్సి ఉందని తెలిసిన తర్వాత వాటిని తీసుకున్నవారు మళ్లీ తెచ్చిచ్చారని తెలుస్తోంది.
సాయంత్రం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తారని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. రాత్రంతా ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది.