పద్మ అవార్డు: సైనా నెహ్వాల్ ఫైర్, దిగొచ్చిన కేంద్రం?
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ను పద్మ భూషన్ అవార్డుకు సిఫార్సు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినట్లు కనిపిస్తోంది. పద్మ భూషణ్ అవార్డుకు సుశీల్ కుమార్ పేరును సిఫార్సు చేసి తన పేరును సిఫార్సు చేయకపోవడంపై సైనా నెహ్వాల్ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందు రోజే తనకు సైనా నెహ్వాల్ దరఖాస్తు అందిందని, సోమవారం దాన్ని పరిశీలిస్తామని క్రీడా శాఖ మంత్రి సర్బనంద సోనోవాల్ ఆదివారంనాడు చెప్పారు. సైనా పేరును అవార్డుకు సిఫార్సు చేసే విషయంపై తమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. కాగా, సుశీల్ కుమార్ పేరును ఇప్పటికే మంత్రిత్వ శాఖ పద్మ భూషన్ అవార్డుకు సిఫార్సు చేసింది.
నిబంధన ప్రకారం ఒక అవార్డు పొందినతర్వాత మరో అవార్డు కోసం ఎవరైనా ఐదేళ్లు ఆగాల్సి ఉంటుంది. అయితే, ప్రత్యేక సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటూ పద్మశ్రీ అవార్డు పొంది ఐదేళ్లు పూర్తి కాకుండానే పద్మ భూషణ్ అవార్డుకు సిఫార్సు చేశారు. సైనా నెహ్వాల్ పద్మశ్రీ అవార్డు పొంది ఐదేళ్లు పూర్తయింది. దీంతో సైనా నెహ్వాల్ క్రీడా మంత్రిత్వ శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు.
పద్మ భూషణ్ ఆవార్డు సైనా నెహ్వాల్ పేరును సిఫార్సు చేస్తూ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిరుడు ఆగస్టులో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసింది. రెండు పద్మ అవార్డులకు మధ్య ఐదేళ్ల తేడా ఉండాలని మార్గదర్శ సూత్రాలు చెబుతున్నాయని, సుశీల్ కుమార్ పేరును సిఫార్సు చేసినప్పుడు ఐదేళ్ల తేడా ఉన్న తన పేరును ఎందుకు పంపలేదని సైనా అన్నారు. తనకు ఇది చాలా చెడుగా అనిపిస్తోందని అన్నారు.
2010 తర్వాత తాను కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించానని, బ్యాడ్మింటన్లో తొలి పతకం సాధించానని, కెరీర్లో రెండో అత్యుత్తమ ర్యాంక్ సాధించానని, చాలా సూపర్ సరీస్ టైటిల్స్ గెలుచుకున్నానని, దాంతో తాను పద్మ విభూషన్ అవార్డుకు అర్హత ఉందని భావించానని, అయినప్పటికీ తన పేరును సిఫార్చు చేయలేదని, ఇదేం బాగా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాను నిన్న ఉన్నతాధికారులతో మాట్లాడానని, సుశీల్ కుమార్ పేరు సిఫార్చు చేశామని చెప్పారని, తన విషయం పరిశీలించాలని మాత్రమే తాను విజ్ఞప్తి చేయగలనని, తామిద్దరికీ ఆ అవార్డు వస్తే మంచిదని, ప్రత్యేకమైన కేసుగా పరిగణించి సుశీల్ కుమార్ పేరు సిఫార్చు చేసినప్పుడు నిబంధనల మేరకు నడుచుకుంటే తన పేరు ఎందుకు సిఫార్సు చేయరని, తన పేరు పంపాల్సిందేనని ఆమె అన్నారు.