'అంఫైర్ల తప్పిదాల వల్లే బంగ్లాపై భారత్ గెలిచింది'
మెల్బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్లో బంగ్లాదేశ్పై భారత్ విజయం సాధించడం పట్ల ఆ దేశ ప్రధాని మంత్రి షేక్ హసీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ను గెలిపించింది అంఫైర్లేనని, ఒకవేళ అంఫైర్లు సరైన నిర్ణయం తీసుకుంటే బంగ్లాదేశే విజయం సాధించి ఉండేదని ఆమె పేర్కొన్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు (మార్చి 20న) ఆస్టేలియాలో స్ధిరపడ్డ బంగ్లాదేశీయులంతా కలిసి గౌరవార్ధం తమ జాతీయ జట్టుకు విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కూడా ఆహ్వానించారు.
సమయం లేక పోవడం వల్ల హాజరుకాలేకపోయిన ఆమె ఫోన్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు. లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ హసీనా ప్రసంగాన్ని నిర్వాహకులు వినిపించినట్టు తెలుస్తోంది. "అంఫైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు మనం ఓటమి పాలై ఉండోచ్చు. కానీ ఏదో ఒకరోజు బంగ్లాదేశ్ ప్రపంచ విజేతగా నిలవడం ఖాయం" అని హసీనా అన్నారని పలు వార్తా సంస్ధలు వార్తా కథనాలు ప్రచురించాయి.
మార్చి 19న రెండో క్వార్టర్ ఫైనల్లో భాగంగా మెల్బోర్న్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో 90 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రోహిత్ శర్మ క్యాచ్ అవుటైనా, దాన్ని అంపైర్లు అలీమ్ దార్, గౌల్డ్లు నోబాల్గా ప్రకటించడం, ఆ తర్వాత మహ్మదుల్లా క్యాచ్ను బౌండరీలైన్ అంచు వద్ద ధావన్ పట్టిన క్యాచ్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
దీంతో పాటు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న ముస్తాఫా కమాల్ కూడా రెండో క్వార్టర్స్ మ్యాచ్లో అంపైరింగ్పై తీవ్ర అసంతృప్తితో తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడారు. ఆ మ్యాచ్లో బంగ్లాకు వ్యతిరేకంగా జరిగిన అంపైరింగ్ పొరపాట్లను చూస్తే, అంపైర్లు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించినట్టు (ఫిక్స్) అనిపించిందని కమాల్ వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు. అంతేకాదు రానున్న కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతానని ఆయన ప్రకటించిన సంగతి విదితమే.