టిడిపి మహానాడు: జగన్ 'సాక్షి'కి నో ఎంట్రీ!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా ప్రతినిధులకు తెలుగుదేశం పార్టీ మహానాడులో బ్యాన్ పెట్టారు. తమను ఆహ్వానించకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు సాక్షి మీడియా ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది.
సాక్షి మీడియా గ్రూప్ సంస్థల ప్రతినిధులకు పాసులు ఇవ్వకూడదని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. నిజానికి, గత రెండేళ్లుగా సాక్షి మీడియా గ్రూప్ ప్రతినిధులను ఏ తెలుగుదేశం పార్టీ ఏ సమావేశానికి కూడా అనుమతించడం లేదు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరు కాకుండా సాక్షిపై నిషేధం పెట్టారు. అయితే, ఈ విషయంలో ప్రెస్ కౌన్సిల్ జోక్యం చేసుకుని నోటీసులు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం సాక్షి మీడియా ప్రతినిధులను అనుమతిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు మాత్రం వారిని అనుమతించడం లేదు.
పని కట్టుకుని వ్యతిరేక వార్తలు రాసినప్పటికీ పత్రికల విషయంలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా సమావేశాలకు రాకుండా నిషేధం విధించలేదని సాక్షి వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీ మహానాడు బుదవారంనాడు హైదరాబాదులో ప్రారంభమైంది. ఇది మూడు రోజుల పాటు జరగనుంది.