రాజ్భవన్ టెలిఫోన్ హ్యాక్: భారీగా విదేశాలకు కాల్స్
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అధికారిక కార్యాలయం రాజ్భవన్లో ఓ టెలిఫోన్ లైన్ హ్యాకింగ్కు గురైంది. టెలిఫోన్ బిల్లు అధికంగా రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్భవన్ టెలిఫోన్ లైన్ నుంచి ఒమన్, శ్రీలంకకు భారీగా కాల్స్ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
అత్యంత కీలకంగా భావించే ఈ నెట్వర్క్లోకి దుండగులు చొరబడి భారీగా విదేశాలకు ఫోన్ చేశారనే దానిపై స్పష్టత రావడంతో ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ కేసును తెలంగాణ సిఐడి అధికారులకు అప్పగించారు. వారు విచారణ నిమిత్తం ఒమన్, శ్రీలంక దేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం.
రాజ్భవన్ ఈపీబీఎక్స్ బాక్స్ ఐపీ అడ్రస్ను చోరీ చేసి దీని ద్వారా విదేశాలకు కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ను దేశవ్యాప్తంగా అనేక మందికి అనుసంధానించగా బిల్లు మాత్రం రూటింగ్ వాడిన ఫోన్ యజమానికి వస్తుంది. గత నెల గవర్నర్ కార్యాలయం టెలిఫోన్ బిల్లు ఐదు లక్షల వరకు రావడంతో బిఎస్ఎన్ఎల్ అధికారులు విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై విచారణ జరుపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి రూటింగ్ ద్వారా కాల్స్ను అందుకున్న భారత్కు చెందిన వారిలో అనేక మంది బంగారం వ్యాపారులు ఉన్నట్లు తేలింది. దీంతో బంగారం అక్రమ రవాణా వ్యవహారాల కోసం ఈ కాల్స్ను వాడి ఉంటారని అనుమానిస్తున్నారు.
మరోవైపు గవర్నర్ కార్యాలయం నెంబర్ వినియోగించి రూటింగ్ ద్వారా మాట్లాడిన అంతర్జాతీయ కాల్స్లో శ్రీలకం, ఒమన్ల నుంచి కాల్స్ ఉండటంతో సీఐడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎల్టిటిఈ ఉగ్రవాదులకు ఒమన్ సహా మరికొన్ని దేశాలకు సంబంధాలు ఉన్నాయి.
గవర్నర్ కార్యాలయ ఫోన్కు ట్యాపింగ్ నిఘా ఉండదనే కారణంగానే దీన్ని ఎంచుకున్నారా అనేది తెలాల్సి ఉంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు త్వరలో శ్రీలకం, ఒమన్ దేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం.