పందుల్లాగా, అసభ్యంగా: ఐపిఎల్ చీర్ లీడర్ కామెంట్
ముంబై: ఐపీఎల్లో చీర్ లీడర్ల హంగామా, హొయలు, సొగసులు చూసి చాలా మందే మురిసిపోతుంటారు. అయితే ఓ చీర్లీడరే తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంది. చీర్లీడింగ్ కోసం వెళ్లే ప్రతీచోటా తుంటరి వ్యక్తులు ఉంటారని, అసభ్యకర మాటలను, చేష్టలను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. వారందరినీ పందులతో పోల్చింది ఆ అమ్మాయి. "నేను ఇండియాలో మరో పాశ్చా త్య దేశంలో చీర్లీడింగ్ చేశాను. భారత్లో ప్రేక్షకులు మరీ అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎక్కడకు వెళ్లినా పందులే. అసభ్యంగా అరుస్తుంటారు" ఆమె వ్యాఖ్యానించింది.
అయితే స్టేడియంలో సంగీత హోరుతో వారేం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినబడకపోయినా, అవి అసభ్యకర మాటలేనని అర్థమవుతాయని అన్నది. సాధ్యమైనంత వరకూ వాటిని తాను పట్టించుకోననని, ఈ సంఘటనలతో కలతచెందినా, సహజసిద్ధంగా నవ్వు తూ నర్తించడానికి ప్రయత్నిస్తుంటానని చెప్పింది. ఇక చిన్నపిల్లలు, ఆడవారితో తప్ప ఇతరులతో ఫొటోలకు పోజివ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
చీర్లీడర్లలో భారతీయులు ఎందుకుండరనే విషయం తనకు అసలు అర్థంకాదని, ఇదే విషయాన్ని తమ మేనేజర్లను అడిగినా, వారూ తెలియదంటారని ఆ చీర్లీడర్ అమాయకత్వం నటించింది. తన పేరును వెల్లడించడానికి ఆ చీర్ లీడర్ ఇష్టపడలేదు. రెడ్డిట్ నెట్వర్కింగ్ సైట్లో ఆ చీర్ లీడర్ తన భావాలను పంచుకుంది.
తమ జట్టు గెలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, కుర్చీలో కూర్చుంటే బోర్గా ఉంటుందని, డ్యాన్స్ చేస్తుంటే ఆనందం వేస్తుందని ఆమె చెప్పింది. ఇంతకు ముందు తాను క్రికెట్ అబిమానిని కానని, ఇప్పుడు అభిమానిగా మారిపోయానని చెప్పింది.