సిరిసేన కోసం తిరుమల తాళం పగులగొట్టారు
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు మైత్రిపాల సిరిసేన తన భార్యతో కలిసి రావడానికి కొద్ది సేపటి ముందు స్వర్ణద్వారం తలుపులు తెరుచుకోలేదు. అవి ఇరికిపోవడంతో తెరవడం కష్టసాధ్యమైంది.
వివిఐపి దర్శనం నేపథ్యంలో చేసేది లేక అధికారులు రంపంతో తాళాన్ని కోసేసి ద్వారం తెరిచారు. దాంతో సిరిసేన ఏ విధమైన ఇబ్బంది లేకుండా శ్రీవారిని దర్శించుకోగలిగారు. బుధవారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. పాత తాళం స్థానంలో కొత్త తాళాన్ని తెచ్చి పెట్టారు. దీంతో భక్తులకు కూడా ఏ విధమైన ఇబ్బంది కలగలేదు.
తెల్లవారు జామున గం.2.15 నిమిషాలకు ఆలయ అర్చకులు వచ్చి బంగారు వాకిలి తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. సుప్రభాత సేవ చేయడానికి అవసరమైన తలుపులు తెరుచుకోలేదు. 3 గంటలకు సుప్రభాత సేవ చేయాల్సి ఉండగా అర్చకులు 45 నిమిషాల ముందే వచ్చారు. అప్పుడు బంగారు వాకిలి తెరిచి, ఆవరణను శుభ్రం చేస్తారు. బంగారు వాకిలిని తెరవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఒకేసారి మూడు తాళం చెవులు ఉపయోగించాల్సి ఉంటుంది.
మొదటి తాళం చెవి ఇరుక్కుపోయి తాళం తెరుచుకోలేదు. దీంతో దాన్ని పగుల గొట్టారు అప్పటికే సిరిసేన తన భార్య పుష్పకుమారితో బయట సుప్రభాత సేవకోసం నిరీక్షిస్తున్నారు. వైకుంఠ కాంప్లెక్స్కు వెళ్లడానికి ముందు ఆ దంపతులు మహాద్వారం వద్ద నించున్నారు.