గన్నవరంపై బాబు ప్లాన్:భూమి కోల్పోనున్నకృష్ణంరాజు
విజయవాడ: ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులు తమ భూములు కోల్పోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తెలుగు ప్రముఖ నటుడు కృష్ణం రాజు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్లు తమ తమ భూములను విమానాశ్రయం కోసం కోల్పోనున్నారని తెలుస్తోంది.
కృష్ణంరాజు, అశ్వనీదత్లకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయ సమీపంలో దాదాపు 70 ఎకరాల భూమి ఉంది. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయికి తీర్చిదిద్దాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం విమానాశ్రయ చుట్టుపక్కల ప్రాంతాన్ని తీసుకోనుంది.
ఈ నేపథ్యంలో పలువురి భూములు ప్రభుత్వం తీసుకొని, వారికి పరిహారం ఇవ్వనుంది. అందులో కృష్ణంరాజు, అశ్వనీదత్ల భూములు కూడా ఉన్నాయని తెలుస్తోంది. గన్నవరం విమానాశ్రయం కోసం భూసేకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. దీనికి ఆయా భూయజమానుల నుండి సానుకూల స్పందన వస్తోంది.
అజ్జంపూడి, బుధ్దవరం, కేసరపల్లి... ఈ మూడు గ్రామాలు విమానాశ్రయ భూముల పరిధిలోకి వస్తున్నాయి. ఈ గ్రామాల రైతులు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంను పరిగణలోకి తీసుకొని... గన్నవరం వద్ద కూడా వరల్డ్ క్లాస్ విమానాశ్రయం నిర్మించేందుకు ప్రముఖ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.