కొడుకు సినిమా కోసం టీఆర్ఎస్పై జయసుధ తగ్గారా?
హైదరాబాద్: సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు, ప్రముఖ నటి జయసుధ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరవచ్చుననే ఊహాగానాలు సోమవారం పెద్ద ఎత్తున వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు మంగళవారం ప్రకటించారు.
జయసుధ రాజకీయాల పైన ఎప్పటి నుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, ఆయన మృతి తర్వాత పలుమార్లు రాజకీయాల పైన తన అసంతృప్తి బహిరంగానే వ్యక్తం చేశారు.
అలాంటి జయసుధ తెరాసలో చేరుతారనే ఊహాగానాలు సోమవారం ఆసక్తిని కలిగించాయి. అయితే, ఆమె తెరాసలో చేరాలని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గి ఉంటారని, అందుకు కారణాలు కూడా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
జయసుధ నటి. ఈ నేపథ్యంలో ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదల్చుకోరని చెప్పవచ్చు. సహజంగా ఏపీ ప్రజల్లో ఎక్కువ మందిలో తెరాస పైన ఆగ్రహం ఉందని చెప్పవచ్చు. విభజనకు ప్రధాన కారణం తెరాసగా భావిస్తారు.
అంతేకాదు, పలు సందర్భాల్లో కేసీఆర్ ఆంధ్రా నాయకులతో పాటు ఆంధ్రా వంటకాలు, పూజారుల గురించి తక్కువ చేస్తూ మాట్లాడినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. నాయకుల పైన విరుచుకుపడితే తప్పులేదు కానీ ఆంధ్రా గురించి మాట్లాడటం... ఏపీ ప్రజలు జీర్ణించుకోరనే చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసలో చేరితో ఆంధ్రా ప్రాంతంలో నటి అయిన జయసుధకు ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ కారణంగానే ఆమె వెనక్కి తగ్గి ఉంటారని అంటున్నారు. అంతేకాదు, త్వరలో ఆమె తనయుడి బస్తీ చిత్రం విడుదల కాబోతుంది. ఇలాంటి సమయంలో తెరాసలో చేరవద్దని ఆమె భావించి ఉంటారని అంటున్నారు.