కేంద్రమంత్రినే పంపించి, సారీ చెప్పించిన మహిళ!
పాట్నా: రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్లో సమాజ్ వాది పార్టీ నేతకు ఓ మహిళ షాకిచ్చిన విషయం మరవకముందే... తాజాగా బీహార్లో ఓ కేంద్రమంత్రిని మహిళా కానిస్టేబుల్ ఝలక్ అడ్డుకున్నారు. పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయటకు వెళ్లే మార్గం నుండి కేంద్రమంత్రి లోపలకు వెళ్తుంటే.. మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు.
అడ్డదిడ్డంగా విమానాశ్రయంలోకి ప్రవేశిస్తున్న కేంద్రమంత్రి వాహనాన్ని అడ్డుకొని, బయటకు దారి చూపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ మంగళవారం విమానాశ్రయానికి కాన్వాయ్లో వచ్చారు.
బయటకు వెళ్లే మార్గం గుండా లోపలకు పోతుండటాన్ని డ్యూటీలో ఉన్న మహిళా అధికారి గమనించారు. కేంద్రమంత్రి కారులో ఉన్నారని చెప్పినా వినకుండా కాన్వాయ్ను అడ్డుకొన్నారు.
ఇంతలో మీడియా ప్రతినిధులు మూగడంతో కొద్దిసేపు ఎదురుచూసి... కేంద్రమంత్రి వెనక్కి వెళ్లారు. దీనిపై కేంద్రమంత్రి తన తప్పును కూడా అంగీకరించారు. సదరు మహిళా కానిస్టేబుల్ను మెచ్చుకున్నారు.
తాను చేసింది తప్పేనని, కాకపోతే ఏదో తొందరలో అలా చేయాల్సి వచ్చిందని సదరు కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ అంగీకరించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చినట్లు ఆయన చెప్పారు.