కోతి యుద్దం: 20మంది బలి.. భీకరంగా కొనసాగుతున్న 'వార్'
లిబియాలో కోతి రేపిన చిచ్చు కారణంగా ఏకంగా ఓ యుద్దమే జరుగుతోంది. ఇప్పటిదాకా 20మంది సామాన్య ప్రజలు ఆ యుద్దంలో కన్నుమూశారు.
లిబియా : మొన్నీమధ్యే.. వరంగల్ జిల్లా దుంగొడి మండలం తొగర్రాయి గ్రామంలో కోతి పెట్టిన చిచ్చు కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కిరాణ దుకాణంలోకి చొరబడ్డ కోతి.. దుకాణంలోని కొన్ని చాక్లెట్ డబ్బాలు ఎత్తుకెళ్లడంతో.. భర్త ఆమెను తీవ్రంగా దూషించడం.. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయాయి.
కోతి కారణంగా ఆత్మహత్య చేసుకున్న వివాహిత..
ఇప్పుడు లిబియాలోను కోతి రేపిన చిచ్చు కారణంగా ఏకంగా ఓ యుద్దమే జరుగుతోంది. ఇప్పటిదాకా 20మంది సామాన్య ప్రజలు ఆ యుద్దంలో కన్నుమూశారు. ఇంతకీ ఆ చిచ్చుకు కోతి ఎలా కారణమైందంటే..! లిబియాలోని సాభా నగరంలో ఓ వ్యక్తి కోతులను పెంచుతుంటాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే ఆడపిల్లలపై వాటిని ఉసిగొల్పి ఆటపట్టిస్తుంటాడు.
ఇదే క్రమంలో ఓ బాలిక పైకి కోతిని ఉసిగొల్పిగా అది కాస్త బాలిక చేతిని కొరికి, ఆమె స్కార్ఫ్ ను లాక్కెళ్లిపోయింది. విషయం ఇంటికెళ్లి అమ్మ నాన్నలకు చెప్పడంతో.. సదరు కోతుల యజమానిని వారు నిలదీశారు. అయితే కోతుల యజమాని కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో.. ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది.
అలా.. వ్యక్తుల మధ్య మొదలైన వివాదం కాస్త.. అక్కడి స్థానిక గిరిజన తెగల మధ్య యుద్దానికి దారి తీసింది. కోతుల యజమాని తరుపు గిరిజన తెగ, బాధిత బాలిక తరుపు గిరిజన తెగ.. వీధి పోరాటానికి దిగారు. దీంతో పగలు రాత్రి అన్న తేడా లేకుండా ప్రస్తుతం ఈ రెండు తెగల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. హోవిడ్జర్, ఫిరంగులు, మోర్టారులతో దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 20మంది మృతి చెందగా, మరో 60మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ రెండు తెగల మధ్య యుద్దాన్ని అక్కడి మీడియా 'కోతి యుద్దం'గా పరిగణిస్తుండగా.. వివాదానికి కారణమైన కోతి చనిపోయినట్లు వార్తలు వస్తుండడం గమనార్హం.