తల్లి ప్రేమకు లొంగిన కరుడుగట్టిన ఉగ్రవాది ఉమర్ ఖలిక్
శ్రీనగర్: ఆ తల్లి ప్రేమ కరుడు గట్టిన ఉగ్రవాదిని కట్టిపడేసింది. విద్రోహశక్తుల చేతిలో కీలుబొమ్మగా మారిన తన కొడుకును చూసి.. ఆ తల్లి తన ఆవేదనను అతనికి మొరపెట్టుకుంది. ఉగ్రవాద సంస్థలు ఆ సాధారణ వ్యక్తిని కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిస్తే.. ఆ తల్లి తన ప్రేమతో మళ్లీ సాధారణ వ్యక్తిలా మార్చే ప్రయత్నం చేసింది. ఆమె రోదన, ఆవేదన అర్థం చేసుకున్న ఆ కొడుకు ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. అతడే గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయిన కరుడు గట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాది ఉమర్ ఖలిక్ మిర్(26).
వివరాల్లోకి వెళితే.. సోపోర్లోని ఓ ఇంట్లో లష్కరే తయిబా(ఎల్ఈటీ) ముష్కరుడు ఉమర్ ఖలిక్ మిర్ దాగి ఉన్నాడంటూ నిఘా సమాచారం అందుకున్న సైన్యం.. వెంటనే వెళ్లి ఆ ఇంటిని చుట్టుముట్టింది. నేరుగా లోపలికి వెళ్తే ఎదురుకాల్పులు చోటుచేసుకొని.. ప్రాణనష్టం తప్పదని బలగాలు భావించాయి. దీంతో హింసాత్మక మార్గంలో వెళ్లకుండా.. ఉమర్ ఖలిక్ ను సురక్షితంగా అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించాయి.
ఇంటి నుంచి బయటకు వచ్చి లొంగిపోవాలంటూ అధికారులు మిర్కు సూచించారు. అయితే, వారి సూచనలను మిర్ ఖాతరు చేయలేదు. దీంతో అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని తుజ్జర్లో నివాసముంటున్న మిర్ తల్లిదండ్రులకు అధికారులు పరిస్థితిని వివరించారు.
కుమారుడు లొంగిపోయేలా అనునయించాలని సూచించారు. అతడికి పెద్ద శిక్ష పడకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకు ఆ తల్లిదండ్రులు వెంటనే అంగీకరించారు. అనంతరం మిర్ దాగి ఉన్న ఇంట్లోకి అతడి తల్లిదండ్రులు వెళ్లి భావోద్వేగంతో కుమారుడికి చాలాసేపు మొరపెట్టుకుంది.
ఎట్టకేలకు తల్లి వేదనకు కరిగిపోయిన ఉమర్ ఖలిక్ మిర్.. బయటకు వచ్చి సైన్యానికి లొంగిపోయాడు. తన వద్ద ఉన్న రైఫిల్, తూటాలు, గ్రెనేడ్లు, రేడియో సెట్ను అధికారులకు అప్పగించాడు. కాగా, ఈ ఏడాది మేలో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మిర్.. ఎల్ఈటీలో చేరాడు.
ఇది ఇలా ఉండగా, జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఆదేశానుసారం ఉగ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు ఆ రాస్ట్ర పోలీసులు, భద్రతాదళాలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఉమర్ను సజీవంగా అదుపులోకి తీసుకున్నారు.