అక్షయ్ X అమీర్: మాటమార్చిన ఖాన్పై నెటిజన్ల ఫైర్
ముంబై: బాలీవుడ్లో అసహనం పైన అగ్రహీరోల మధ్య పరోక్షంగా వాగ్వాదం నడిచింది. దేశంలో అసహనం ఉందన్న అమీర్ ఖాన్ వ్యాఖ్యల పైన అక్షయ్ కుమార్ పరోక్షంగా స్పందించారు. గత ఏడాది నవంబర్ నెలలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.
ఏ దేశంలోనైనా ఎత్తుపల్లాలు సహజమేనని, ఈ మాత్రానికే అంతటి వ్యాఖ్యలు సరికాదని అక్షయ్ కుమార్ అన్నారు. ఈ దేశంలో మనం మాట్లాడుకోని మంచి ఎంతో ఉందని, దురదృష్టవశాత్తు చెడును వేలెత్తి చూపడం మన అలవాటని ఎద్దేవా చేశారు.
బాలీవుడ్లో అంతా అసహనం గురించి మాట్లాడుతున్నారని, ఇది చిన్నపిల్లల మనస్తత్వమని, వారితో తాను ఏకీభవించనని జయపుర సాహితీ ఉత్సవంలో బిజెపి ఎంపీ శతృఘ్న సిన్హా పేర్కొన్నారు. తన అసహనం వ్యాఖ్యల పైన ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా, అక్షయ్, శతృఘ్ను సిన్హా విమర్శించారు.
ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ స్పందించారు. మాట మార్చారు. తాను భారత్లో అసహనం ఉందని తానెప్పుడూ చెప్పలేదని, అలాగే ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదని అమీర్ ఖాన్ అన్నారు. నేను ఇక్కడే పుట్టానని, ఈ గడ్డపైనే మరణిస్తాననని అమీర్ చెప్పారు.
తాను అసహనం ఉందని చెప్పలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఇందులో మీడియా తప్పు కూడా ఉందన్నారు. భావోద్వేగాలు దెబ్బతిన్నవారి ఆవేదనను అర్థం చేసుకోగలనని, భారత్లో ఉన్నంత వైవిధ్యం మరే దేశంలోనూ లేదని, తనకు నా దేశం అంటే చాలా ఇష్టమని, విదేశాలకు వెళితే రెండు వారాలకు మించి భారత్ను వదిలి ఉండలేనన్నారు.
ఇదిలా ఉండగా.. అమీర్ ఖాన్ వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తొలుత అసహనంపై విమర్శలు చేసి, ఇప్పుడు దానిపై వెనక్కి తగ్గారు. భారత్ అసహన దేశమని తానెన్నడూ అనలేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు.
అమీర్ ఖాన్ ఇచ్చిన సంజాయిషీ నెటిజన్లను ఏమాత్రం సంతృప్తిపరిచినట్లు లేదు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అతడి తాజా చిత్రం దంగల్ పైన బహిష్కరణ వ్యాఖ్యలు మొదలయ్యాయి.
'బాయ్ కాట్ దంగల్' పేరిట ట్విట్టర్లో సోమవారం ప్రారంభమైన ఓ ప్రచారం హోరెత్తుతోంది. సినిమాల కోసం ఏమైనా చేయడానికి అమీర్ ఖాన్ వెనుకాడటం లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దంగల్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.