కుక్కకు సీమంతం చేసిన దంపతులు.. అనంతలో హాట్ టాపిక్
హిందూపురం : పెంపుడు జంతువుల పట్ల తమ ప్రేమాభిమానాలను చాటుకోవడంలో.. ఒక్కొక్కరిది ఒక్కో పంథా. మొన్నీమధ్యే చైనాకు చెందిన ఓ బిలియనీర్ కొడుకు తను గారంగా పెంచుకునే పెంపుడు కుక్క కోసం ఎనిమిది ఐఫోన్7ఎస్ ఫోన్లను కొనిచ్చి కుక్కపై తన ప్రేమను చాటుకున్నాడు. ఇక తాజాగా అనంతపురంకు చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు శునకానికి సీమంతం నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఓ హాట్ టాపిక్.
అనంతపురం జిల్లా హిందూపురంలో నివాసముండే బేల్దారి శ్రీనివాసులు, లీలావతమ్మ దంపతులకు ఇద్దరు మగసంతానమే, ఆడపిల్లలు లేరు. ఇదే క్రమంలో ఆ కుటుంబం ఓ కుక్కును పెంచుకుంటోంది. కాగా, ఈమధ్యే అది గర్భం దాల్చడంతో.. తమ ఇంట్లో ఓ కుటుంబ సభ్యురాలిగా పెంచుకున్న ఆ కుక్కకు సీమంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆ కుక్కకు వారు పెట్టుకున్న పేరేంటో తెలుసా..! 'అనిత'.. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్న ఆ ఇంట్లో వాళ్లంతా తమ పెంపుడు శునకాన్ని అదే పేరుతో పిలుస్తారు.
సరే ఎలాగు సీమంతం చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి.. ఓ ఆడపడుచుకు ఏవిధంగానైతే అన్ని లాంఛనాలతో సీమంతం జరిపిస్తారో.. అలా ముత్తయిదువులందరిని పిలిచి శునకానికి సీమంతం జరిపించారు. ఇందుకోసం ఇంటింటికి వెళ్లి తమ బిడ్డ సీమంతానికి రావాల్సిందిగా చుట్టుపక్కల వారిని ఆహ్వానించారు. శునకాన్ని ముస్తాబు చేసి, కుర్చీపై కూర్చోబెట్టి, కొత్త దుస్తులు తొడిగి.. పసుపు కుంకుమ రాసి మంగళ హారతులిస్తూ.. శునకాన్ని దీవించారు. అనంతరం విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. సీమంతానికి హాజరైన మహిళలంతా సదరు శునకాన్ని దీవించి అక్కడినుంచి కదిలారు.