మీది కొత్త రాష్ట్రమా, వీటి మాటేమిటి: కేటీఆర్కు ఏపీ వ్యక్తి లేఖ
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని పదేపదే చెబుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏపీకి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బహిరంగ లేఖ రాశారు అందులో, తెలంగాణ కొత్త రాష్ట్రం ఎలా అవుతుందని ప్రశ్నల వర్షం కురిపించారు.
సదరు వ్యక్తి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక అనుసంధాన వేదికల్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఆయన లేఖ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆ బహిరంగ లేఖలో.. తెలంగాణ రాష్ట్రం కొత్తదే అయితే మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికే ఎలా ఉందని ప్రశ్నించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సాఫ్టువేర్ ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పటికే ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. అంతేకాకుండా, కొత్త రాష్ట్రమే అయితే సర్ప్లస్ రాష్ట్రంగా ఎలా ఉందో చెప్పాలని ప్రశ్నించారు.
ఆ విషయానికి వస్తే ఏపీ కొత్త రాష్ట్రమని, ఎందుకంటే, అసలు ఇక్కడ రాజధానితో సహా ఏదీ లేదని పేర్కొన్నారు. రాసిన వ్యక్తి యువకుడా, యువతా తెలియదు. కానీ ఏపీ సిటిజెన్గా పేర్కొన్నారు.
నేను మీ (కేటీఆర్) ప్రసంగాలు వింటుంటానని, మీ ప్రసంగాలు నాకు చాలా ఇష్టమని చెప్పారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్ పర్యటన సమయంలో, అ తర్వాత పలు సందర్భాల్లోను మీ ప్రసంగం విన్నానని, తనను ఆకట్టుకుందని అందులో పేర్కొన్నారు.
కానీ మీ ప్రసంగంలో ప్రతిసారి మీరు, తెలంగాణను ఇప్పుడే ఏర్పడిన రాష్ట్రంగా చెబుతారని, అది సరికాదని అభిప్రాయపడ్డారు.
మీరు చెప్పిందే నిజమైతే.. మీకు మెగా రాజధాని ఎలా అప్పటికే ఉందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన మొదటి రోజు నుంచే మీకు అత్యున్నత రాజధాని ఉందని, ఐఎస్బీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ - హైదరాబాద్ వంటివి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అలాగే, బెస్ట్ విమానాశ్రయం ఉందని చెప్పారు.
కోట్లాది రూపాయల ట్యాక్సులు ప్రజల నుంచి వస్తున్నాయన్నారు. కోట్లాది రూపాయలను కూడా మీ పార్టీ ప్రచారాల కోసం ఎలా ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు. వీటన్నింటిని చూస్తూ కూడా ఇప్పుడే ఏర్పడిన లేదా కొత్త రాష్ట్రంగా ఎలా చెప్పగలరని సదరు వ్యక్తి ప్రశ్నించారు.
అసలు ఏమీ లేని ఏపీని మేం కొత్త రాష్ట్రంగా ఎందుకు భావించకూడదని అభిప్రాయపడ్డారు. అసలు ఏపీకి రాజధాని లేదు, కనీసం ఉద్యోగులు వచ్చి పని చేసేందుకు సౌకర్యాలు లేవు, ముఖ్యమంత్రి కార్యాలయానికి తాత్కాలిక భవనం నుంచి పని చేస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవన్నారు.
దేశం మొత్తం మీద ఏపీ నవ రాష్ట్రమని, అందుకు దాని పరిస్థితి చూస్తేనే తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజధాని లేదు, మౌలిక సదుపాయాలు లేవు, ఐటీ సెక్టార్ లేదు, పరిశ్రమలు లేవు, రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని.. పలు అంశాలను పేర్కొన్నారు. ఈ లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలామంది దీనిని షేర్ చేస్తున్నారు.