ఒలింపిక్స్ దాటేశాం:పుష్కరాలపై బాబు గిన్నిస్ ప్లాన్
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా పుష్కరాలను రెండు తెలుగు రాష్ట్రాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. పుష్కరాల కోసం ఇరు ప్రభుత్వాలు చేసిన ఏర్పాట్ల పైన భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కృష్ణా పుష్కరాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఏపీలో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్ సంస్థలు అన్నదానం ఏర్పాటు చేశాయి.
బీజేపీపై కావూరి ఆసక్తికర వ్యాఖ్య, మోడీ సాయం చేస్తే..: బాబు ఒలింపిక్స్ కల
ప్రభుత్వ సహకారంతో ఆ సంస్థలు చేసిన అన్నదానం తాజాగా గిన్నిస్ రికార్డులకు ఎక్కనుందట. విజయవాడలో చంద్రబాబు సోమవారం అధికారులతో మాట్లాడిన సందర్భంగా.. కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
పుష్కర అన్నదానం రియో ఒలింపిక్స్ రికార్డులను బద్దలు కొట్టేసిందని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది. రియో ఒలింపిక్స్లో రోజుకు కేవలం 50 వేల మందికి మాత్రమే భోజనాలు వడ్డించారని, పుష్కరాల్లో రోజుకు 1.5 లక్షల మందికి అన్నదానం చేయగలిగామన్నారు.
ఇది ముమ్మాటికీ ప్రపంచ రికార్డేనని చంద్రబాబు అన్నారు. అన్నదానానికి సంబంధించిన అన్ని వివరాలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు నిర్వాహకులకు పంపాలని అధికారులకు సూచించారని తెలుస్తోంది.
కాగా, చంద్రబాబు పుష్కర ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదులకు పుష్కరాలకు నిర్వహించే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. జలం, జనమే తన ఆస్తి అని చెప్పారు. వీరి సహకారంతో దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తానన్నారు.
నా వల్లే సింధు విజయం: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య, గెలుపు తన ఖాతాలో!
సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకూడదని, ప్రకృతిని చిన్నచూపు చూస్తే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన నది కృష్ణ అని అభివర్ణించారు. కుల, మతాలకు అతీతంగా పుష్కర స్నానాలు చేయడం అభినందనీయమన్నారు.
పుష్కర భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎం తెలిపారు. పుష్కరాల్లో యువత అందిస్తున్న సేవలు ఎనలేనివని చంద్రబాబు కొనియాడారు. టెక్నాలజీని ఉపయోగించుకొని పుష్కరాల్లో దొంగలను ముందుగానే పసిగడుతున్నట్లు చెప్పారు.
కొంతమంది ఎంత డబ్బు ఉన్నా ఇంకా సంపాదించాలని ఆత్రుత చెందుతున్నారని, నిజాయితీగా సంపాదించినదే నిలుస్తుందని అడ్డదారిలో సంపాదిస్తే నిలవదని వ్యాఖ్యానించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. కరువు సమయంలో రెయిన్గన్స్ ద్వారా పంటలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గోదావరి- పెన్నా నదులను అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.