అవార్డులకోసం వెంట పడుతున్నారు: గడ్కరీ సంచలనం
నాగపూర్: కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటితరం ప్రముఖ బాలీవుడ్ నట్ ఆశా పరేఖ్ తనకు పద్మ విభూషణ్ కావాలని అడిగిందని చెప్పారు. చాలామంది అదే దారిలో అత్యున్నత పురస్కారాల కోసం అడుగుతున్నారని చెప్పారు.
పద్మ అవార్డులకు తమను సిఫార్సు చేయాలని చాలామంది వెంటపడుతున్నారని గడ్కరీ వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవలే నటి ఆశా పరేఖ్ తన ఇంటికి వచ్చి మరీ సిఫార్సు చేయమని అడిగారని తెలిపారు.
వృద్ధురాలైన ఆశా పరేఖ్ ముంబైలోని తమ ఇంటికి వచ్చారని, ఆ సమయంలో లిఫ్టు పని చేయలేదని, అయినా ఆమె పన్నెండవ అంతస్థులో ఉన్న తమ ఇంటికి మెట్లు ఎక్కి మరీ వచ్చారని గడ్కరీ తెలిపారు. చాలా బాధేసిందని గడ్కరీ అన్నారు.
చాలా బాధేసిన తాను ఎందుకు ఇలా చేశావని ఆశాను అడిగానని చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ... తనకు పద్మశ్రీ వచ్చిందని, ఇప్పుడు పద్మభూషణ్ కావాలని, అందుకు తాను అర్హురాలినని చెప్పారని గడ్కరీ వెల్లడించారు.
అందుకు తాను స్పందిస్తూ... మీరు పద్మశ్రీ అందుకున్నారని, అది కూడా పద్మభూషణ్ వంటిదేనని చెప్పానని, కానీ ఆమె అందుకు 'అలా కాదు' అని తనకు సమాధానం ఇచ్చారని గడ్కరీ చెప్పారు. తాను చాలా చిత్రాల్లో నటించానని ఆమె చెప్పారన్నారు.
పద్మ అవార్డులు ఇవ్వడం ఓ పెద్ద తలనొప్పిగా మారుతోందన్నారు. పద్మ శ్రీ, పద్మభూషణ్ అవార్డుల కోసం చాలామంది రికమండేషన్లు పంపిస్తున్నారన్నారు. కాగా, భారత్ రత్న, పద్మవిభూషణ్ తర్వాత భారత అత్యున్నత పురస్కారం (మూడో అత్యున్నత పురస్కారం) పద్మభూషణ్.