సూర్యగ్రహణాలు: ఆ రెండు రోజులు ఉత్పాతాలేనట!
విజయవాడ: ఈ నెల 9వ తేదీ, సెప్టెంబర్ ఒకటో తేదీన సంపూర్ణ సూర్యగ్రహణాలు సంభవించనున్నాయని, ఏప్రిల్ 17 నుంచి జూన్ 17 దాకా గ్రహస్థితులు అనుకూలించట్లేదని ప్రముఖ జ్యోతిష్కుడు, పంచాంగకర్త పొన్నలూరి శ్రీనివాస గార్గేయ అంటున్నారు.
ఆ రెండు రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆయనహెచ్చరించారు. విజయవాడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శత్రు గ్రహాలైన శని, కుజులు ఈ సమయంలో కలిసి వక్ర సంచారం చేయనున్నాయని. దీంతోపాటు సింహరాశిలో గురు, రాహువుల కలయిక సంభవించనున్నదని తెలిపారు.
ఈ ప్రతికూల గ్రహస్థితులు, సూర్యగ్రహణాల వల్ల హింసాత్మక వాతావరణం, అశాంతి, దేశాలు, రాష్ట్రాల మధ్య కలతలు ఏర్పడే అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు. పాలకులు తమను తాము కాపాడుకుంటూనే ప్రజల బాగోగులను పట్టించుకోవాల్సి ఉంటుందన్నారు.
ఏప్రిల్ 17 నుంచి శని, కుజ గ్రహాల వక్ర సంచారం జూన 17వరకు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రెండో ప్రపంచయుద్ధం నాటి భయానక పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం మనదేశంలో పాక్షికంగా కనిపిస్తుందని, దానివల్ల భూకంపాలు వచ్చే ముప్పు ఉందని చెప్పారు.
ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడానికి సూర్య సంబంధిత యాగాలతోపాటు లలితా అమ్మవారి పూజలు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. తొలి యాగం ఈ నెల ఆరున హైదరాబాద్లో జరుగుతుందని చెప్పారు.