ధోనీకి రూ.20 కోట్లు టోపీ పెట్టిన ఆస్ట్రేలియా కంపెనీ
సిడ్నీ: భారత క్రికెట్ జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కంపెనీ రూ.20 కోట్ల మేర మోసం చేసింది. ధోనీ పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎండార్సుమెంట్లతో అతను కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు.
ఆస్ట్రేలియాకు చెందిన 'స్పార్టాన్ స్పోర్ట్స్' సంస్థ ధోనీని మోసం చేసింది. ఒప్పందాలను గౌరవించకుండా రూ.20 కోట్లకు పైగా ఎగనామం పెట్టింది. వివిధ రకాల క్రీడా పరికరాలను తయారు చేసే ఆ కంపెనీ ధోనీతో మూడేళ్ల పాటు బ్యాట్, స్పాన్సర్ షిప్ కింద రూ.13 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.
కానీ చెల్లింపులు చేయడంలో విఫలమైంది. రాయల్టీ తదితరాలు కలుపుకొని ఇవ్వాల్సిన సొమ్ము రూ.20 కోట్లకు చేరింది. ఈ ఒప్పందం 2013 డిసెంబర్లో జరిగింది. అయితే, ధోనీకి నాలుగుసార్లు మాత్రమే చెల్లింపులు చేశారని.. ఆయన వ్యవహారాలు చూసే రితీ స్పోర్ట్స్ తెలిపింది. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో చెల్లింపులు జరిపిందన్నారు. బకాయిల ఎగవేత పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది.