వెంకయ్యని పవన్ టార్గెట్ చేయడం వెనుక: లడ్డూలకూ కథ
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యంగా కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడును లక్ష్యంగా చేసుకుంటున్నారు. వెంకయ్యను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో పవన్ మాటల్లోనే తేలిపోతోంది.
వెంకయ్య నాయుడు బాధ్యతల (ప్రత్యేక హోదా) నుంచి తప్పించుకుంటున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. నాడు హోదా అని పట్టుబట్టామని, ఇవాళ కుదరదు అంటే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. సాధ్యం కానప్పుడు, హోదా వల్ల లాభం లేనప్పుడు ఆనాడు ఎందుకు అడిగారో చెప్పాలన్నారు.
విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఏపీకి హోదా కోసం గట్టిగా పట్టుబట్టిన విషయం తెలిసిందే. హోదా అయిదేళ్లు కాదని, పదేళ్లు కావాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అయిదేళ్లు ఇస్తామంటే రాజ్యసభలో వెంకయ్య పదేళ్ల కోసం డిమాండ్ చేసి, ఏపీ ప్రజల దృష్టిలో పడ్డారు.
ఏపీకి న్యాయం కావాలని కోరింది వెంకయ్య మాత్రమేనని ఆనాడు అందరూ అభిప్రాయపడ్డారు. ఆయనను ఆకాశానికెత్తారు. ఇప్పుడు అదే వెంకయ్య హోదా ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.
అంతేకాదు, తెలుగువాడు, అదీ ఏపీకి చెందిన వ్యక్తి కేంద్రమంత్రిగా ఉన్నారు. నాడు గట్టిగా పట్టుబట్టారు. ప్రత్యేక హోదా పేరుతో ఓట్లు కొల్లగొట్టారు. స్వయంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సమయంలో హోదా ఇస్తామని తిరుపతిలో ప్రకటించారు.
నాడు ప్రత్యేక హోదా తన వల్లే వచ్చిందని వెంకయ్య నాయుడు, బీజేపీ చెప్పారు. ఇప్పుడు హోదా రాకపోవడంపై మరి ఎవరిని ప్రశ్నించాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా కనిపిస్తోంది. వెంకయ్య బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారన్నారు.
పాచిపోయిన లడ్డూల వెనుక కథ
పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో మాట్లాడుతూ.. రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. వాటిని చంద్రబాబు తీసుకుంటారా లేదా చూడాలని అన్నారు. అయితే, పాచిపోయిన లడ్డూల వ్యాఖ్యల వెనుక ఓ అర్థం ఉందని చెబుతున్నారు.
విభజన జరిగి రెండున్నరేళ్లవుతోంది. ఈ రెండున్నరేళ్ల పాటు హోదా హోదా.. అంటూ పోరాడి, ఇప్పుడు ఆలస్యంగా రూ.2 లక్షల కోట్లకు పైగా ఇవ్వడం పాయిపోయిన లడ్డూగా పవన్ అభిప్రాయపడుతున్నారు. అప్పుడే తీసుకుంటే బాగుండేదిగా అని ఆయన అభిప్రాయం. రెండున్నరేళ్ల తర్వాత హోదా రాదని చెప్పడం, ఇప్పుడు డబ్బులు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు.