పెళ్ళి కానుకగా ఆమె ఎలాంటి గిఫ్ట్ ఇచ్చిందంటే, ఆదర్శంగా నిలిచిన మహరాష్ట్ర యువతి
ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి వివాహం చేసుకొంటే అంత గొప్ప అనుకొంటారు. అయితే మహారష్ట్రకు చెందిన శ్రేయ అనే వధువు తన వివాహనికి అయ్యే ఖర్చుతో 108మందికి ఇళ్ళను నిర్మించి ఇచ్చింది.
ముంబాయి:పెళ్ళి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఎంత ఎక్కువ ఖర్చు చేసి వివాహం చేస్తే అంత గొప్పగా వివాహం చేసినట్టుగా ఈ రోజుల్లో ఉంటుంది. ధనవంతులు తమ పిల్లల వివాహలను చాలా గొప్పగా చేస్తుంటారు. కోట్లాది రూపాయాలను ఖర్చు చేస్తుంటారు. వధువుకు ఇచ్చే కట్న కానుకలు అదనం.అయితే మహారాష్ట్రకు చెందిన ఓ నవ వధువు మాత్రం తన పెళ్ళికి అయ్యే ఖర్చుతో 108మంది పేదలకు ఇళ్ళు నిర్మించి అందరికీ ఆధర్శంగా నిలిచింది.
మహారాష్ట్రలోని ఔరంగబాద్ జిల్లాకు చెందిన శ్రేయ మునోద్ వివాహన్ని ఆమె కుటుంబసభ్యులు నిర్ణయించారు. శ్రేయ మునోద్ కుటుంబానికి మంచి ఆస్తులు ఉన్నాయి. ఆమె అత్తింటివారికి కూడ అదే స్థాయిలో ఆస్తులున్నాయి. అయితే ఈ రెండు కుటుంబాల మద్య వివాహం నిశ్చయమైంది. దరిమిలా తన వివాహన్ని గుర్తుండిపోయేలా చేసుకోవాలని శ్రేయ నిర్ణయించుకొన్నారు.
పేదలకు ఇళ్ళు
శ్రేయ సమీపబంధువు ఆమెకు ఒక సలహా ఇచ్చారు. ఆమె వివాహన్ని అందరూ గుర్తుంచుకొనేందుకుగాను పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని సూచించాడు.ఈ సలహా ఆధారంగా ఆమె తన వివాహం సందర్భంగా చేసే ఖర్చుతో 90 మంది పేదలకు ఇళ్ళను నిర్మించింది.అయితే 108 ఇళ్ళను ఆమె ప్రారంభించింది.అయితే 90 ఇళ్ళు మాత్రం ఇప్పటికే పూర్తయ్యాయి.
వివాహం జరిగే రోజున ఎవరికైతే ఆమె ఇళ్ళు నిర్మించిందో వారిని ప్రత్యేకంగా తన వివాహనికి ఆహ్వానించింది. పెళ్ళి మండపంలోనే వారికి ఇంటి తాళాలు అందించింది. వివాహ మండపంలోనే వారికి ఇళ్ళకు సంబంధించిన తాళాలను అందించడంతో వివాహానికి వచ్చిన వారంతా ఆమెను ప్రశంసించారు. కొత్త తరహ సంప్రదాయానికి ఆమె తెరతీశారు. డబ్బులున్నవారంతా ఇదే తరహాలో ఆలోచిస్తే పేదలకు ఉపయోగం ఉంటుంది.
అండగా నిలిచిన అత్తింటి వారు
తన వివాహం అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని శ్రేయ నిర్ణయించుకొన్నారు. అయితే వివాహం కోసం చేసే ఖర్చును పేదలకు ఇళ్ళ నిర్మాణం కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నానని ఆమె తన అత్తింటివారికి కూడ ముందే చెప్పారు. శ్రేయ నిర్ణయాన్ని ఆమె అత్తింటివారు కూడ అంగీకరించారు.ఈ నిర్ణయాన్ని వారు సమర్థించారు. శ్రేయ తీసుకొన్న నిర్ణయంతో రెండు కుటుంబాలను స్థానికులు అభినందలతో ముంచెత్తుతున్నారు. ఎన్ని డబ్బులున్నా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చేవారు అతి తక్కువ మంది ఉంటారు. అయితే వివాహం సందర్భంగా పేదలకు ఇళ్ళు నిర్మించిన శ్రేయ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. కొందరైనా ఈ తరహాలో ఆలోచించాలని సూచిస్తున్నారు.