వేశ్య ఎఫెక్ట్: 'నా మైనర్ కూతుర్ని వేధిస్తున్నారు'
లక్నో: బీఎస్పీ అధ్యక్షురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను దయాశంకర్ సింగ్ను బీజేపీ రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసింది. ఈ ఘటన పైన దయాశంకర్ సింగ్ భార్య స్వాతి శుక్రవారం నాడు ట్విస్ట్ ఇచ్చారు.
తన మైనర్ కూతురును బీఎస్పీ నేతలు వేధిస్తున్నారని, ఇందుకు గాను తాను మాయావతి పైన కేసు పెడతానని ఆమె చెప్పారు. తమ కుటుంబాన్ని బీఎస్పీ కార్యకర్తలు, నాయకులు వేధించడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
'మాయావతి వేశ్య కంటే హీనం': బీజేపీ నేత, పార్టీలో కుదుపు
తన భర్తను అన్ని పార్టీ పోస్టుల నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, తన భర్తను తొలగించారని, అయినప్పటికీ మాయావతికి ఇంకా సంతృప్తి లేదని మండిపడ్డారు.
తమను వేధించాలని బీఎస్పీ కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారన్నారు. తన కూతురును వేధించాలని చెప్పడం విడ్డూరమన్నారు. తన కుటుంబానికి తన కూతురుకు ఏమైనా జరిగితే మాయావతియే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.
తాను చేసిన వ్యాఖ్యలకు తన భర్త క్షమాపణ కూడా చప్పారని, అయినప్పటికీ ఆమె తగ్గడం లేదని, తన భర్త తల తీసేయాలని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వేధిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.