సైకిల్పై స్వారీకి మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి?
కడప: చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు డిఎల్ రవీంద్రా రెడ్డి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన త్వరలో సైకిలెక్కుతారని ప్రచారం సాగుతోంది. తనకు అత్యంత సన్నిహితుడైన వైఎస్ రాజశేఖర్రెడ్డిని విమర్శించడానికి కూడా వెనుకాడని రాజకీయ వ్యక్తిత్వం ఆయనది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డితోనూ ఆయన పడలేదు.
కాంగ్రెసులోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెర వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయన గురించిన చర్చ ముందుకు వచ్చింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన డీఎల్ తమ పార్టీలో చేరుతారంటనే టిడిపి నాయకులు ఎగిరి గంతేస్తున్నారట. ఈ విషయమై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్తో కూడా చర్చించినట్లు చెబుతున్నారు.
అయితే డీఎల్ రాకను ప్రస్తుతం మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ యాదవ్ అడ్డుకుంటున్నారని అంటున్నారు. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడికి సుధాకర్ యాదవ్ సమీప బంధువు కావడంతో ఆయన ద్వారా డీఎల్ను పార్టీలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని అంటున్నారు.
మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం సుంకేసుల డిఎల్ స్వగ్రామం. వృత్తిరిత్యా డాక్టర్ అయిన ఆయన ఖాజీపేటలో చాలాకాలం వైద్యవృత్తిని కొనసాగించారు. 1978లో మైదుకూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. అప్పట్నుంచి రాజకీయాలలో మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగారు.
ఎఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నాలుగు సార్లు మంత్రిగా పని చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. గత ఎన్నికలలో మైదుకూరు నుంచి టీడీపీ తరపున సుధాకర్ యాదవ్ పోటీ చేశారు. ఆయనకు పూర్తిగా మద్దతిస్తానని హామ ఇచ్చిన డిఎల్ ఆ తర్వాత చేయి ఇచ్చారని అంటున్నారు.