ఎంసెట్ లీక్: ముందే చెప్పిన పంచాగం! బాధ్యులెవరు?
హైదరాబాద్: ఎంసెట్ 2 లీకేజ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అవినీతి పైన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉగాది పర్వదినం సందర్భంగా వినిపించిన పంచాంగ శ్రవణంలో ముందే హెచ్చరించారు. విద్యా, వైద్య రంగాల్లో అవినీతి పెరుగుతోందని దుర్ముఖి నామ ఉగాది సందర్భంగా పంచాగ శ్రవణం కార్యక్రమంలో చెప్పారు.
పంచాంగ శ్రవణం మాటలు పొల్లు పోలేదని అంటున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఎంసెట్: కింగ్ పిన్ ఖలీల్, విద్యార్థులకు సీఐడీ ఝలక్!
ఆ కార్యక్రమంలో పంచాంగ పఠనకర్తగా సంతోష్ కుమార్ శర్మ వ్యవహరించారు. ఆయన పంచాంగం చదువుతూ.. విద్యా, వైద్య రంగాల్లో అవినీతి పెరిగిపోతుందని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్ తన ప్రసంగంలోనూ ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ శాఖల మంత్రులు కడియం , లక్ష్మారెడ్డి అప్రమత్తంగా ఉండాలని సరదాగా వ్యాఖ్యానించారు.
ఎవరికి వారు తప్పించుకుంటున్నారు!
ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంలో ఒకవైపు సీఐడి వేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. అసలు దీని బాధ్యత ఎవరిదనే చర్చ జోరుగా సాగుతోంది. ఎంసెట్ 2 పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావటంతో ఇటు విద్యాశాఖ మంత్రి, అటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఎవరికి వారు ఈ అంశం తమది కాదని చెబుతున్నారు.
సాధారణంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన కోర్సుల ప్రవేశాల కోసం ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహిస్తారు. ఎంసెట్ నిర్వహణకు కన్వీనర్ను ఎంపిక చేసి, పరీక్ష నిర్వహించి, ఫలితాలను వెల్లడించే వరకు విద్యాశాఖ బాధ్యత ఉంటుంది. ఎంసెట్ పరీక్ష ఏ యూనివర్సిటీ నిర్వహించాలనేది ఉన్నత విద్యా మండలి నిర్ణయిస్తుంది.
ఉన్నత విద్యా మండలి విద్యాశాఖ పరిధిలో పనిచేసే సలహా మండలి. అయితే ఈసారి ఎంసెట్ నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యా మండలి జేఎన్టీయూకు అప్పగించింది. దీంతో రమణారావుకే ఎంసెట్ కన్వీనర్ బాధ్యతలను అప్పగించారు.
ఎంసెట్ లీక్లో 'బీహారీ'?: ఖలీల్ పట్టుబడితేనే.., ఎంసెట్ 3పై భగ్గు
ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎంసెట్ 2తో సంబంధం లేకపోవటంతో విద్యాశాఖ పట్టించుకోలేదంటున్నారు. అయితే ఎంసెట్ 2 నిర్వహణ బాధ్యత కూడా ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన క్రమంలో సంబంధిత అధికారులు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో సంప్రదించి ఎంసెట్ 2 తేదీలను ఖరారు చేసి కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
అనంతరం ఎంసెట్ 2 కన్వీనర్ రమణా రావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డితో కలిసి ఎంసెట్ 2 ర్యాంకులను కూడా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు.
కానీ ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంతో సీన్ రివర్స్ అయింది. పరీక్ష నిర్వహణ బాధ్యత తనది కాదంటూ ఎవరికి వారు చెబుతున్నారని అంటున్నారు. ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని మంత్రులు ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు.