సుష్మా 'ఇరాన్ లుక్'పై నెటిజన్ల ఆగ్రహం: అసలు ఏం చేశారు?
న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాన్ పర్యటనలో తాను ధరించిన దుస్తుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెహ్రాన్లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో పాల్గొన్న తుది సమావేశంలో సుష్మా ముస్లిం మహిళల తరహాలో తన తలను వస్త్రంతో కప్పుకొని ఉంది.
ఇది హిందూ సంప్రదాయం కాదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలు విమర్శలతో కూడిన ట్వీట్లతో పాటు సుష్మ, రౌహానీల సమావేశపు ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.
సుష్మా స్వరాజ్ చీర ధరించి, హిందూ సంప్రదాయబద్ధంగా తలపై కప్పుకుని ఉంటే బాగుండేదని ఒకరు, ఇరానీలు లేదా సౌదీ అరేబియా డిప్లమాట్స్ హిందూ సంప్రదాయం ప్రకారం నుదుటిపై కుంకుమ పెట్టుకుంటారా? అని మరొకరు, ముస్లిం మహిళల తరహాలో సుష్మా వేషధారణ ధరించడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఇంకొకరు ట్వీటెత్తారు.
విదేశాంగ శాఖ దేశానికి, దేశ సంప్రదాయానికి ప్రాతినిధ్యం వహించాలి కానీ ఈ ఇరాన్ లుక్ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నించారు. అక్కడికి వెళ్లినంత మాత్రాన వాళ్లలా మనం వస్త్రధారణ చేసుకోవాలా? ఇరాన్ అధ్యక్షుడు భారత్కు వస్తే భారతీయ సంప్రదాయ దుస్తులు ధరిస్తారా.. అన్నారు. సుష్మ వస్త్రధారణ మరీ వాళ్లముందు మోకరిల్లినట్లుగా ఉందని, అలా ఉండాల్సింది కాదని కొందరు విమర్శించారు.
అయితే, సుష్మా ఎప్పటిలానే నిండుగా చీర ధరించారు. అయితే దాని మీద అదే రంగు శాలువాను తలపై నుంచి పూర్తిగా కప్పుకుని ఉన్నారు. చీర రంగు, శాలువా రంగు ఒకటే అవడంతో చూడడానికి అచ్చంగా ఇరానీ మహిళల తరహా వస్త్రధారణలాగా ఉంది. దీంతో సుష్మపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కొంతమంది సుష్మకు మద్దతుగానూ ట్వీట్ చేశారు. ఇరాన్ చట్టాల ప్రకారం మహిళలు తలమీదుగా నిండుగా దుస్తులు ధరించడం అవసరమని, అందుకు తగినట్లుగా సుష్మ వస్త్రధారణ ఉందని, అందులో తప్పేం లేదని వారు పేర్కొన్నారు. ఇరానీ మహిళలపై ఉన్న ఈ వస్త్రధారణ నియమాన్ని కొందరు ప్రముఖ మహిళలు గతంలో వ్యతిరేకించినా ఫలితం లేకపోయిందని గుర్తు చేశారు.